దేశంలో తొలి రైల్వే వర్సిటీ ఇక్కడే: మారనున్న రైల్వే రూపురేఖలు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఆమోదంతో దేశంలో తొలి రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటుకానుంది. అదికూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో నెలకొల్పనున్నారు. ఇందులో రైల్వేలకు సంబంధించిన అన్ని అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖ విధివిధానాలను రూపొందిస్తోంది. ఇప్పటికే వడోదరలోని ప్రతాప్ విలాస్ ప్యాలెస్ను వర్శిటీ తాత్కాలిక భవనంగా గుర్తించిన కేంద్రం.. ఇక్కడ ఇండియన్ రైల్వేస్కు ఎంపికయ్యే ఉద్యోగులకు శిక్షణ ఇస్తుందని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు.
ఈ వర్శిటీకి అవసరమైన అన్ని వసతులను కల్పించేందుకు గుజరాత్ ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ (ఎన్ఏఐఆర్) ఏర్పాటవుతుందని, భూసేకరణ తర్వాత ప్రతాప్ విలాస్ ప్యాలెస్ నుంచి వర్శిటీ భవనం తరలుతుందని చెప్పారు. తొలి దశలో ఎంబీఏ, ఎంటెక్ డిగ్రీ విద్యార్థులకు డిప్లమో, రైల్వే ఆపరేషన్స్ విభాగంలో బీటెక్ కోర్సులను ఆఫర్ చేయనున్నామని మనోజ్ సిన్హా వెల్లడించారు.
తొలి రైల్ యూనిర్వసిటీ
‘భారతదేశంలో తొలిసారి ఏర్పాటువుతున్న రైల్వే విశ్వవిద్యాలయంతో దేశ రైల్వే రూపురేఖలు మారనున్నాయి' అని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియాలను దృష్టిలో పెట్టుకుని తొలి రైల్వే యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. వడోదరాలో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీతో ఔత్సాహికులకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తాయని చెప్పారు.
మోడీ ప్రత్యేక శ్రద్ధ.. 2018లో
ఈ యూనివర్సిటీ ఏర్పాటు, అభివృద్ది చేయడంలో ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధను కనబర్చారని చెప్పారు. కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో రైల్వే విశ్వవిద్యాలయం వచ్చే జూన్ నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. తొలి విద్యార్థుల బ్యాచ్ జూన్ 2018 నుంచి తరగతులు మొదలవుతాయి.
ఏర్పాట్లు మొదలు
ఈ తరహా యూనివర్సిటీ ఉద్యోగ అవకాశాలను కల్పించడంతోపాటు సేవలను మెరుగుపర్చేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. యువత తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ వర్సిటీ ఉపయోగపడుతుందని చెప్పారు. రైల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొలయ్యాయని తెలిపారు.
3వేల మంది విద్యార్థులకు అవకాశం
సుమారు 3వేల మంది విద్యార్థులు ఒకేసారి ఈ యూనివర్సిటీలో చేరే అవకాశం ఉందని చెప్పారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సెటిలైట్ సాయంతో ట్రాకింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా గుర్తించిండం, ఆర్షిఫీషియల్ ఇంటెలీజెన్స్ అంశాలను వర్సిటీలో బోధించడం వల్ల ఉద్యోగుల సేవల్లో మెరుగుదల ఏర్పడనుంది.