దారుణం: యూపీలో నర్సుని కిడ్నాప్ చేసి మూడు రోజుల పాటు అత్యాచారం
మొరాదబాద్: మనదేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా ఉత్తరప్రదేశ్లో మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఒక నర్సుని కిడ్నాప్ చేసి, ఆమెపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడని ఘటన ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మొరాదబాద్ జిల్లాలోని రాంపూర్లో గంజ్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల ఓ నర్సు ఆదివారం కూరగాయలు కొంటున్న సమయంలో నలుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఒక అజ్ఞాత ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెపై మూడు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత ఆమెను బుధవారం రాత్రి రాంపూర్లోని నాగ్లాబైపాస్ రోడ్డుపై వదిలి వెళ్లారు. ఆమె బట్టలు కూడా చిరిగిపోయి ఉన్నాయి. స్ధానికులు ఆమెను సమీపంలో ఉన్న ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.