ఘోరం: డాక్టర్లు వాడిన పీపీఈలు, గ్లోవ్స్, మాస్కులు నర్సులకు, కరోనాతో సీనియర్ నర్సు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 46 ఏళ్ల నర్సు కరోనాతో ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఆస్పత్రిలోని నర్సులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ), గ్లోవ్స్, మాస్కులు కూడా వాడినవే ఇస్తున్నారని చనిపోయిన నర్సు సహోద్యోగిణి ఒకరు ఆరోపించడం గమనార్హం.
కరోనాతో మరణించిన తొలి నర్సు..
కల్రా ఆస్పత్రిలో సీనియర్ నర్సుగా పనిచేస్తున్న కేరళకు చెందిన పీకే అంబికా అనే మహిళ.. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటూ ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయింది. మే 21న ఆమె ఆస్పత్రిలో చేరారు. కాగా, ఢిల్లీలో కరోనాతో మరణించిన తొలి నర్సు అంబికానే కావడం గమనార్హం.
నర్సులకు వాడిన పీపీఈ కిట్లు, గ్లౌవ్స్, మాస్కులే
కాగా, అంబికా మరణంతో కల్రా ఆస్పత్రిలోని మిగితా నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకందరికీ వాడిన పీపీఈలు, గ్లౌవ్స్, మాస్కులు ఇస్తున్నారని ఆరోపించారు. అంబికా కుమారుడు కూడా ఇదే ఆరోపణ చేశాడు. ఆస్పత్రిలోని వైద్యులు ఉపయోగించిన పీపీఈ కిట్లు, గ్లౌవ్స్, మాస్కులనే నర్సులకు ఇస్తున్నారని, దీంతో నర్సులు కరోనా బారిన పడుతున్నారని కల్రా ఆస్పత్రి సీనియర్ నర్సు ఒకరు ఆరోపించారు.
డాక్టర్లు వాడిన తర్వాతే నర్సులకు..
డాక్టర్లకు మాత్రమే కొత్త పీపీఈ కిట్లు, గ్లౌవ్స్, మాస్కులు ఇస్తున్నారని చెప్పారు. తాము వాడిన వాటిని ఉపయోగించేందుకు నిరాకరిస్తే.. తమది కోవిడ్-19 ఆస్పత్రి కాదని, అందువల్ల ఎలాంటి పెద్ద సమస్య ఉండదని ఆస్పత్రి యాజమాన్యం చెప్పిందని సీనియర్ నర్సు వెల్లడించారు. చనిపోయిన నర్సు కుటుంబానికి నష్టపరిహారం అందించాలని కేరళకు చెందిన ఎంపీ ఆంటో ఆంటోనీ ప్రధాని నరేంద్ర మోడీకి, సీఎం కేజ్రీవాల్కు లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రి నర్సు మరణం పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిందని ఆరోపించారు.
ఆరోపణలో వాస్తవం లేదంటూ ఆస్పత్రి యాజమాన్యం..
అయితే, కల్రా ఆస్పత్రి యజమాని డాక్టర్ ఆర్ఎన్ కల్రా నర్సుల ఆరోపణలను ఖండించారు. ఆస్పత్రిలోని అందరు సిబ్బందికి పీపీఈ కిట్లు ఇస్తున్నామని, హ్యాండ్ శానిటైజర్స్ కూడా ఇస్తున్నామని చెప్పారు. తన వద్దకు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. ఒకవేళ ఆరోపించిన విధంగా ఏదైనా జరిగివుంటే దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కల్రా అన్నారు. ఆస్పత్రి వైద్యులు, కొంత మంది నర్సులు కూడా యాజమాన్య వాదనకు మద్దతు తెలుపుతున్నారు.