రెండుచోట్ల బరిలోకి నవీన్ పట్నాయక్ : ఎందుకంటే కారణమిదీ ?
భువనేశ్వర్ : సార్వత్రిక ఎన్నికల సమరంలో రాజకీయ పార్టీలు దూసుకెళ్తున్నాయి. అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికల రణరంగంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోన్నాయి. కాంగ్రెస్, బీజేపీ సహా ప్రాంతీయ పార్టీలు లోక్ సభకు, ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీకి అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. గెలుపుగుర్రాలు, సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు.

రెండుచోట్ల నవీన్ పట్నాయక్ పోటీ
రాష్ట్రంలో 21 లోక్ సభ, 147 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడత జరిగే ఎన్నికల కోసం 9 లోక్సభ, 54 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సీఎం నవీన్ పట్నాయక్ రెండుచోట్ల బరిలోకి దిగుతున్నారు. తన సొంత నియోజకవర్గం హింజిలీతోపాటు బిజేపూర్ నుంచి కూడా బరిలోకి దిగుతున్నారు. అభ్యర్థులను ప్రకటించే ఒకరోజు ముందు తాను పశ్చిమ ఒడిశా నియోజకవర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తానని సంకేతాలు ఇచ్చారు. చెప్పినట్టుగానే బిజేపూర్ నుంచి కూడా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు నవీన్ పట్నాయక్.

అసలు కారణం ఇదీ ..?
పశ్చిమ ఒడిశా నుంచి బరిలోకి దిగాలను వివిధ వర్గాల నుంచి నవీన్ పట్నాయక్ను కోరారు. నేతలతోపాటు రైతులు, మహిళలు, విద్యార్థుల నుంచి విజప్తి రావడంతో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారాయన. వారి కోరిక మేరకు బీజేపూర్ నుంచి బరిలోకి దిగాలని డిసిషన్ తీసుకున్నట్టు తెలిపారాయన. దీంతోపాటు 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో తమ పార్టీ ప్రాబల్యం తగ్గుతుందని భావించినా .. ఆయన పార్టీ బలోపేతం కోసం బీజేపూర్ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు పశ్చిమ ఒడిశా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ఫోకస్ చేశారు. ఇటీవల వరుసగా పర్యటిస్తూ .. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతోపాటు కాంగ్రెస్ కూడా తమ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అంచనాతో పశ్చిమ ఒడిశాపై దృష్టిసారించారాయన. ఇక తన సిట్టింగ్ స్థానం హిజిలీ నుంచి 2000 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

4 విడతల్లో ఎన్నికలు
మావోయిస్టు ప్రభావితమైనందున ఒడిశాలో నాలుగు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. ఏప్రిల్ 11, 18, 23, 29 తేదీల్లో ఒడిశా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. నవీన్ పట్నాయక్ బరిలో ఉన్న గంజాం జిల్లా హింజిలీ, బార్గా జిల్లా బిజేపూర్ నియోజకవర్గాలకు రెండో విడత వచ్చేనెల 18వ తేదీన ఎన్నికలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications