రహస్యంగా ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెట్టాడు: మైనర్ బాలిక ఆత్మహత్య
కటక్: ఆడవాళ్లపై మగవారి అకృత్యాలు తారాస్ధాయికి చేరాయని అనడానికి మరో ఘటన ఉదాహారణ. ఈ ఘటన ఒడిషాలోని కటక్లో చోటు చేసుకుంది. మైనర్ బాలిక ఫోటోలు ఓ వ్యక్తి సోషల్ మీడియా వెబ్సైట్ ఫేస్బుక్లో పెట్టడంతో ఆ బాలిక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కటక్ జిల్లాలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలిక స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువకుడు రహస్యంగా ఫోటోలు తీశాడు. అనంతరం ఆ ఫోటోలతో ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనతో శారీరకంగా సంబంధం పెట్టుకోవాలని బెదిరించాడు.
అంతటితో ఆగకుండా బాలిక స్నానం చేసిన ఫోటోలను తన స్నేహితులకు చూపించడమే కాకుండా, సోషల్ మీడియా వెబ్సైట్ ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. ఆ నోటా, ఈ నోటా విషయం తెలుసుకున్న బాలిక తండ్రి గ్రామ పెద్దల మందు పంచాయితీ పెట్టాడు.
పంచాయితీ పెద్దలు యువకుడిని బాధిత మహిళను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరారు. కానీ ఇందుకు ఆ యువకుడు అంగీకరించ లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక విషం తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన పదో తరగతి పరీక్షలకు బాలిక హాజరవ్వగా, యువకుడు స్ధానిక కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.