సైనెడ్ సేవించి జ్యువెలరీ షాప్ యజమాని ఫ్యామిలీ ఆత్మహత్య, కుమార్తె నిశ్చితార్థం, రద్దు !
జీవితంపై విరక్తి చెందిన జ్యువెలరీ షాప్ యజమాని కుటుంబ సభ్యులు సైనెడ్ సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని ఉడిపి సమీపంలో జరిగింది.
బెంగళూరు: జీవితంపై విరక్తి చెందిన జ్యువెలరీ షాప్ యజమాని కుటుంబ సభ్యులు సైనెడ్ సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని ఉడిపి సమీపంలో జరిగింది. ఉడిపి తాలుకాలోని పడుబెళ్లే ప్రాంతంలో నివాసం ఉంటున్నశంకర ఆచార్య (50) కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
శంకర ఆచార్య కు భార్య నిర్మల ఆచార్య (44), కుమార్తెలు శృతి (23), శ్రేయ (21) ఉన్నారు. శంకర ఆచార్య పడుబెళ్లే ప్రాంతంలో శ్రేయ జ్యువెలర్స్ బంగారు నగల షాప్ నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉడిపి వెళ్లి బంగారు నగలు కొనుగోలు చేశాడు. రాత్రి శంకర ఆచార్య షాప్ లో వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్లాడు.
గురువారం ఉదయం ఎంతసేపు అయినా శంకర ఆచార్య, ఆయన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారికి, బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపు పగలగొట్టి చూడగా అందరూ ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.
శంకర ఆచార్య, నిర్మల ఆచార్య, శృతి, శ్రేయ సైనెడ్ సేవించి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. 10 ఏళ్ల క్రితం వ్యాపారంలో ఎక్కువ నష్టం వచ్చిందని, అయితే ఆయన త్వరగా వ్యాపారంలో పుంజుకున్నారని పోలీసులు అన్నారు.
రెండు నెలల క్రితం పెద్ద కుమార్తె శృతికి నిశ్చితార్థం చేశారు. అయితే పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు పెళ్లి రద్దు చేసుకున్నారు. జీవితంపై విరక్తితోనే శంకర ఆచార్య కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.