ఎన్సీ శాసనసభాపక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవం: మరో నలుగురు ఎమ్మెల్యేల మద్దతు
జమ్మూకాశ్మీర్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్(NC), కాంగ్రెస్ కూటమి ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్సీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.
90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకాశ్మీర్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ను దాటాయి. ఎన్సీ 42 సీట్లలో విజయం సాధించగా.. కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలుపొందింది. తాజాగా, ఎన్సీకి నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో ఎన్సీ కూటమి బలం 46 నుంచి 52కు పెరిగింది. ఎన్సీ బలం 48కి చేరింది.

అయితే, కాంగ్రెస్ మద్దతు లేకపోయినా ఎన్సీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిదే అవకాశం ఉంది. కానీ, కాంగ్రెస్ తమ ప్రభుత్వవంలో భాగస్వామి అవుతుందా? అనే విషయంపై ఎన్సీ ఎదురుచూస్తోంది. మరోవైపు, జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో 29 స్థానాలు గెలుచుకున్న బీజేపీకి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. దీంతో ఆ పార్టీ బలం 32కి చేరింది.
కాగా, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా దాదాపు ఖరారయ్యారు. ఇప్పటికే ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా.. ఒమర్ అబ్దుల్లానే ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే రాష్ట్ర హోదా డిమాండ్ తొలి కేబినెట్ తీర్మానమని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఆర్టికల్ 370 తొలగింపు కోసం బీజేపీ సర్కారును డిమాండ్ చేయడం ప్రయోజనం లేని విషయమన్నారు.
అయితే, ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడనేదానిపై స్పష్టత రాలేదు. ఎన్సీ- కాంగ్రెస్ కూటమి నేతలు సమావేశంలో ప్రమాణ స్వీకారంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. అక్టోబర్ 11 లేదా 12 తేదీల్లో ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.












Click it and Unblock the Notifications