ఒమిక్రాన్ ఎఫెక్ట్: అక్కడ థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో కోవిడ్ పూర్తి వ్యాక్సినేషన్ లేకుంటే నో ఎంట్రీ
ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ ఇప్పుడు కర్ణాటక వాసులను బెంబేలెత్తిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడం ఒక్కసారిగా ప్రజల్లో గుబులు పుట్టించింది. కర్ణాటక రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల నమోదుతో కర్ణాటక ప్రభుత్వం ఒమిక్రాన్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అధికార యంత్రాంగం అలెర్ట్ అయ్యింది.
భారతదేశంలో ఒమిక్రాన్ కేసుల నిర్ధారణపై డబ్ల్యూహెచ్ఓ ఆసక్తికర వ్యాఖ్యలు
పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకుంటేనే సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్, పార్కులలోకి అనుమతి
పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకోని వారిని సినిమా హాళ్లు, మాల్స్లోకి ప్రవేశించడానికి అనుమతించరని వెల్లడించింది. రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వారిని మాత్రమే సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, పార్కుల లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి భారతదేశంలోని కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ మొదటి కేసులను గుర్తించినట్లు కేంద్రం ధృవీకరించిన ఒక రోజు తర్వాత రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి కర్ణాటక శుక్రవారం నాడు తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగించిన కొత్త వేరియంట్పై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ రోజు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
తల్లిదండ్రులు వ్యాక్సిన్లు తీసుకుంటేనే విద్యార్థులకు ఆఫ్ లైన్ క్లాసులకు అనుమతి
ఈ సమావేశానికి హాజరైన కర్ణాటక రెవెన్యూ కార్యదర్శి ఆర్.అశోక్ మాట్లాడుతూ.. పూర్తిగా వ్యాక్సిన్ వేస్తే తప్ప రాష్ట్రంలోని మాల్స్, సినిమా హాళ్లలోకి ఎవరినీ అనుమతించబోమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా టీకాలు తీసుకోకపోతే విద్యార్థులు పాఠశాలల్లో ఆఫ్లైన్ తరగతులకు హాజరు కాలేరని పేర్కొన్నారు. కొత్త కోవిడ్ వేరియంట్ ఓమిక్రాన్ దృష్ట్యా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను జనవరి 15, 2022 వరకు వాయిదా వేయాలని పాఠశాలలు మరియు కళాశాలలను కోరినట్లు ఆయన తెలిపారు.
అన్ని విమానాశ్రయాల్లో విదేశాల నుండి వచ్చిన వారికి క్షుణ్ణంగా పరీక్షలు
రాష్ట్రంలోని విమానాశ్రయాలలో ఇతర దేశాల నుండి వస్తున్న ప్రయాణికులందరినీ కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తామని, పరీక్ష నివేదికలు వచ్చిన తర్వాతే ప్రయాణికులను ప్రాంగణం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామని ఆర్ అశోక్ తెలిపారు. విమానాశ్రయాల్లో మరిన్ని టెస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కార్యకర్తలు మరియు 65 ఏళ్లు పైబడిన వారికి నిర్బంధ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని పేర్కొన్నారు. రోజుకు 60 వేల పరీక్షలు ఉండగా లక్షకు పెంచాలని ఆరోగ్య శాఖను కోరామని పేర్కొన్నారు.
బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా ఫైన్లు
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేని వ్యక్తులకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 250 రూపాయలు మరియు ఇతర ప్రాంతాల్లో 100 రూపాయలు జరిమానా విధించబడుతుందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో కోవిడ్ బెడ్లు మరోసారి సిద్ధం చేయబడతాయి అని, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, వాటికి మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచుతామని ఆర్ అశోక్ తెలిపారు. ఆక్సిజన్ లభ్యతను గతంలో ఏర్పాటు చేసిన కమిటీలు పర్యవేక్షిస్తాయని వెల్లడించారు. తాజా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కంట్రోల్ రూమ్లు మళ్లీ ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. కోవిడ్ ఔషధాల కొరత లేకుండా చూసేందుకు, వ్యాక్సిన్లు మరియు ఔషధాలను ముందుగానే కొనుగోలు చేస్తామని రెవెన్యూ కార్యదర్శి ఆర్ అశోక్ తెలిపారు.
Recommended Video
ఒమిక్రాన్ కేసులతో కర్ణాటకలో టెన్షన్ .. డెల్టా కంటే డేంజరస్ అంటూ భయం
ఇదిలా ఉంటే ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరికి కాంటాక్ట్ అయిన ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో, వారికి సోకింది ఒమిక్రాన్ నా.. కాదా అన్నది కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపించారు.దీంతో ప్రజల్లో ఒమిక్రాన్ భయం పట్టుకుంది. దేశంలోనే తోలి కేసులు కర్ణాటక రాష్ట్రంలో నమోదు కావటంతో ఆందోళన నెలకొంది. డెల్టా కంటే డేంజరస్ వేరియంట్ అని చెప్తున్న క్రమంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది.