ఆమె చిరకాల వాంఛ: భార్యను హెలికాప్టర్లో ఇంటికి తీసుకెళ్లిన టీచర్!
జైపూర్: తన భార్య చిరకాల కోరికను నెరవేర్చాడు ఓ భర్త. ఎప్పుడో తనను హెలికాప్టర్లో ప్రయాణించడానికి ఎంత ఖర్చవుతుందని తనను అడగడంతో.. అది గుర్తు పెట్టుకున్న భర్త తన రిటైర్మెంట్ రోజున ఆమె చిరకాల కోరికను నెరవేర్చి ఆమె కళ్లల్లో ఎప్పుడూ లేని ఆనందాన్ని చూశాడు.

ఎప్పుడూ గుర్తుండేలా..
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా మాలావళి గ్రామానికి చెందిన రమేష్ చంద్ మీనా ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 34ఏళ్లపాటు సేవలందించిన ఆయన శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఆ రోజును తన భార్యకు ఎప్పుడూ గుర్తుండేలా చేయాలనుకున్నారు ఆ టీచర్.

ఇదే సరైన సమయం..
ఓసారి తన భార్యతో మెడపై కూర్చున్న సమయంలో ఆమె తనను అడిగిన ఓ ప్రశ్న గుర్తుకు వచ్చింది. హెలికాప్టర్లో ప్రయాణించాలంటే ఎంత ఖర్చవుతుందని ఆమె అప్పుడు ఆయన్ను అడిగింది. అప్పుడే నిర్ణయించుకున్నారు తన భార్య కోరికను తీర్చాలని. ఉద్యోగ విరమణ రోజే సరైన సమయమని ఆయన నిర్ణయించుకున్నారు.

భార్యతో కలిసి హెలికాప్టర్లో ఇంటికి..
అనుకున్నదే తడవుగా డబ్బుల గురించి ఆలోచించకుండా హెలికాప్టర్ను బుక్ చేసుకున్నారు. ఇంకేముందు పాఠశాల వద్దకు వచ్చి వాలింది ఆ విహంగం. ఇక అక్కడ్నుంచి జైపూర్ నుంచి 150కి.మీల దూరంలో ఉన్న తన గ్రామం మాళావళికి తన భార్య, మనవడితో కలిసి హెలికాప్టర్లో ప్రయాణించారు ఆ ఉపాధ్యాయుడు.

పట్టలేని ఆనందం
కాగా, గ్రామంలో ఆ హెలికాప్టర్ నుంచి కిందికి దిగిన ఆ ఉపాధ్యాయ దంపతులను గ్రామస్తులు పూలదండలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు రమేష్ చంద్ర మాట్లాడుతూ.. తన పదవీ విరమణ రోజునే తన భార్య చిరకాల కోరికను తీర్చడం ఆనందంగా ఉందని చెప్పారు. స్థానిక అధికారుల సహకారంతో రూ. 3.70లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్ బుక్ చేసినట్లు తెలిపారు. కాగా, తన భర్త ఎప్పుడో చెప్పిన తన కోరికను గుర్తుపెట్టుకుని తీర్చడం పట్ల రమేష్ భార్య పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications