శశికళకు మెజారిటీ: గవర్నర్ చాన్స్ ఇవ్వకపోవడానికి కారణమిదీ...
శాసనసభా పక్ష నేతగా ఎన్నికై, మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్న శశికళ చేత సిఎంగా ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్ను నిలువరిస్తున్నదేమిటి....
చెన్నై: తమిళనాడులో ముఖ్యమంత్రి కుర్చీ కోసం సాగుతున్న రాజకీయ క్రీడ రాజభవన్కు చేరింది. ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం తనకు ఇవ్వాలని, శాసనసభలో బలపరీక్ష చేసుకుంటానని పన్నీర్ సెల్వం కోరగా, తనకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలని శశికళ విజ్ఞప్తి చేశారు. అయితే, గవర్నర్ మాత్రం ఏ విధమైన నిర్ణయం తీసుకోవడం లేదు.
ప్రస్తుతం తమిళనాడు పరిస్థితిని మలుపు తిప్పే ఆయుధం గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు వద్దనే ఉంది. తనకు మెజారిటీ ఉందని శశికళ వాదిస్తున్నారు. తనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానం ప్రతిని శాసనసభ్యుల సంతకాలతో సహా శశికళ గవర్నర్కు సమర్పించారు.
నిజానికి, శాసనసభా పక్షం ఆమెను నేతగా ఎన్నుకున్న వెంటనే ముహూర్తం ఖరారు చేసి ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించాలి. కానీ గవర్నర్ ఆమెకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. కేవలం మెజారిటీ లేదనే కారణంతో ఆమెను గవర్నర్ నిలువరించడం లేదు. రాజ్యాంగంలోని ఓ నిబంధనకు సంబంధించిన తన విచక్షణాధికారాన్ని వనియోగించుకునే అవకాశాన్ని మాత్రమే గవర్నర్ వాడుకుంటున్నట్లు అర్థమవుతోంది.

శశికళకు 131 మంది సభ్యుల మద్దతు
తనకు 131 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని పేర్కొన్న శశికళ వారి సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్కు సమర్పించారు. శుక్రవారం రాజ్భవన్ వర్గాలు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఆ విషయాన్ని పరిశీలించే పనిలో కూడా గవర్నర్ అదేశాల మేరకు అధికారులు పడినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు ఉన్న శిబిరాన్ని అధికారులు సందర్శించారు. వారు లెక్కపెట్టిన ప్రకారం శశికళకు కనీసం 90 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు భావించవచ్చు. పన్నీర్ సెల్వంకు మద్దతు పెరిగినప్పటికీ మెజారిటీ సాధించేంత బలం లేదని అర్థమవుతోంది. కానీ గవర్నర్ శశికళ చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి సిద్ధపడడం లేదు.

పన్నీరు సెల్వం వర్గం వాదన ఇదీ..
శశికళ ఆదివారం పార్టీ శాసనసభ పక్షనేతగా ఎన్నికయ్యారు. పన్నీరు సెల్వంకు మద్దతు పెరిగింది. అయితే శశికళకు మద్దతిస్తున్న శాసనసభ్యుల సంఖ్య తగ్గాల్సి ఉంది. కానీ గురువారం రాత్రి ఆమె గవర్నర్కు సమర్పించిన లేఖలోనూ 131 మంది పేర్లను ప్రస్తావించారని సమాచారం. అయితే, ఆమె వెంట 90 మంది మాత్రమే ఉన్నారని పన్నీరుసెల్వం వర్గం వాదిస్తోంది. శశికళకు మద్దతుగా సంతకాలు చేసిన శాసనసభ్యులు కూడా ఇష్టపూర్వకంగా చేయలేదని, బెదిరింపులతో సంతకాలు చేయించుకున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గురువారం గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై రాజభవన్ వర్గాలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

అందువల్లనే విద్యాసాగర రావు జాప్యం
శశికళ నిందితురాలిగా ఉన్న ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో కొద్దిరోజుల్లోనే సుప్రీం కోర్టు తీర్పు వెలువడనుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఆమెను ఆపాలని దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలు కూడా అదే కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. దీంతో కోర్టులో ఆ విషయాలు తేలే వరకు వేచి చూడాలని గవర్నర్ భావిస్తున్నట్లు సమాచారం. ఆమె శాసనసభకు ఎన్నికయ్యే అవకాశంపై అనిశ్చితి నెలకొందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేసిన వ్యక్తి సుస్థిర పాలనను అందిస్తారని ధ్రువపరచుకోవాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత గవర్నర్గా తనపై ఉందని విద్యాసాగర రావు అనుకుంటున్నట్లు సమాచారం.

అది పన్నీరు సెల్వం చేసిన ప్రతిపాదనే...
తనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ అన్నాడీఎంకే శాసనసభ్యులు చేసిన తీర్మానాన్ని శశికళ గవర్నర్కు అందించారు. పన్నీర్ సెల్వమే దాన్ని ప్రతిపాదించడం గమనార్హం. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్కు లేఖ సమర్పించినట్లు శశికళకు పన్నీర్సెల్వం చెప్పారని ఆ తీర్మానం తెలియజేస్తోంది. తనపై ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ రాజీనామా లేఖపై సంతకం చేయాల్సి వచ్చినట్లు సెల్వం ఇప్పుడు అంటున్నారు. అందువల్ల దానికి సంబంధించి తీసుకున్న చర్యలను ఉపసంహరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గతంలో ఇలాంటి చిక్కుముళ్లు లేవా..
తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గతంలో ఎదురు కాలేదని అంటున్నారు. పరిస్థితి రాజ్యాంగపరంగా కొన్ని చిక్కుముళ్లు కల్పించినట్లు చెబుతున్నారు. పార్టీ శాసనసభా పక్షం చేసిన తీర్మానం ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శశికళ సిద్ధపడ్డారు. ఆమెకు రాష్ట్ర అసెంబ్లీలో సభ్యత్వం లేదు. అందువల్ల ఇది రాజ్యాంగంలోని 164(1) అధికరణం కింద పరిగణించాల్సిన సూటి అంశం కాదు. ఈ వ్యవహారాన్ని 164(1) రెడ్ విత్ 164(4) అధికరణం కింద పరిశీలించాలి.

రాజ్యాంగంలోని ఆ ఆధికరణ ఏం చెబుతోంది...
ఒక మంత్రి వరుసగా ఆరు నెలల పాటు రాష్ట్ర శాసనసభలో సభ్యుడు లేదా శాసనమండలి సభ్యుడదు కాకుంటే ఆరు నెలల గడువు పూర్తికాగానే ఆ పదవి పోతుందనేది 164 (4) నిబంధన తెలియజేస్తోంది. ఇదే ముఖ్యమంత్రి పదవికి కూడా వర్తిస్తుంది. దానిపై సుప్రీంకోర్టు - 164(4) అనేది పదవి సాధనకు మార్గం కాదని, శాసనసభలో సభ్యత్వం లేని వ్యక్తిని కొంతకాలం పాటైనా ముఖ్యమంత్రిగా, మంత్రిగా నియమించడానికి వీలు కల్పించే వెసులుబాటు కూడా కాదని వాస్తవానికి ఇది.. ఆరునెలల కాలంలోగా శాసనసభలో సభ్యత్వం పొందకుంటే వారిని అనర్హతకు గురిచేయడానికి లేదా పదవి చేపట్టకుండా కట్టడి చేయడానికి ఉద్దేశించిందని తీర్పు చెప్పింది.

శశికళకు ఉన్న అడ్డంకులు ఇవీ...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పును సుప్రీం కోర్టు నిరుడు జూన్లో వాయిదావేసింది. ఈ తీర్పు కోసం ఎదురుచూస్తున్నట్లు కర్ణాటక తరఫు న్యాయవాది దుష్యంత్ దవే చేసిన విజ్ఞప్తి మేరకు కేవలం ఒక్క వారం ఎదురుచూడాలని ధర్మాసనం చెప్పినట్లు మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆరు నెలల్లోగా శశికళ శాసనసభకు ఎన్నికవుతారా అనే సందేహాలు ఎదురవుతున్నాయి. అసెంబ్లీకి ఎన్నికయ్యే ఆమె సత్తాపై ఏ కొంచెం సందేహం ఉన్నా సుప్రీం కోర్టు భాష్యం చెప్పిన రీతిలో 164(4) అధికరణను కట్టడి/ అనర్హత కోణంలోనే అన్వయించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

అది మాత్రమే కాకుండా...
అంతేకాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన వ్యక్తి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరని సంతృప్తి చెందాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత గవర్నర్పై ఉంది. సుప్రీం కోర్టు తీర్పు వెలవడనున్న నేపథ్యంలో శశికళ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆమె అర్హురాలవుతారా అన్న అంశంపై అనిశ్చితి చోటు చేసుకుంది. దీంతో స్పష్టత వచ్చేవరకు వేచి చూడాల్సిన పరిస్థితి గవర్నర్ విద్యాసాగర రావుకు ఎదురైందని అంటున్నారు. దీనికితోడు శశికళను ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వకుండా అడ్డుకోవాలంటూ సుప్రీం కోర్టులో పలు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అవి ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా గవర్నర్ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications