కేజ్రీవాల్ ఎఫెక్ట్: మోడీ 'ఓటు - నోటు', కొత్త ఓట్లపై దృష్టి

తమ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ మాదిరి ఎన్నికల్లో పోటీ చేయటానికి పుష్కలంగా నిధులు లేనందున, ప్రజల నుంచి విరాళాల రూపంలో నిధులను సేకరించాలని నిర్ణయించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత్ కుమార్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ అంశాలపై చర్చించటానికి బిజెపి మంగళవారం బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్లతో విస్తృత సమావేశం నిర్వహించింది.
సమావేశంలో చర్చించి తీసుకున్న వివిధ నిర్ణయాలను అనంత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. మోడీని ప్రధాని చేయాల్సిందిగా కోరుతూ దేశవ్యాప్తంగా పదికోట్ల గృహాలను పార్టీ కార్యకర్తలు పలకరిస్తారని చెప్పారు. దేశానికి మోడీ సారథ్యం అవసరాన్ని తెలియజేస్తామన్నారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించటానికి ముందు జయప్రకాష్ నారాయణ్ నిర్వహించిన తరహాలో తమ పార్టీ అట్టడుగుస్థాయి నుంచి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను పెంపొందించుకునే కార్యక్రమాన్ని చేపడుతుందని ఆయన చెప్పారు.
దేశంలోని పార్లమెంట్ నియోజక వర్గాల్లోని ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి బూత్ సమావేశానికి విధిగా ఐదుగురు కార్యకర్తలు హాజరై తీరాలని అనంత చెప్పారు. ప్రతి బూత్ స్థాయి సమావేశంలో మోడీ ప్రధాని కావలసిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయటం జరుగుతుందని అనంతకుమార్ పేర్కొన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో అందించిన సుపరిపాలన, స్వయం సమృద్ధిని తిరిగి సాధించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించటానికి బిజెపినే గెలిపించాల్సిందిగా కోరతామన్నారు.
కొత్తగా నమోదైన ఓటర్లపై దృష్టి సారించి గరిష్ట స్థాయిలో ఓట్లు దక్కించుకుని ఎన్నికలలో విజయం సాధించాలని బిజెపి వ్యూహరచన చేస్తోంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ కంటే 89 లక్షల తక్కువ ఓట్లతో ఓడిపోయిన నేపథ్యంలో, ఈ తేడాను పూడ్చుకుని అధిక ఓట్లు సాధించేలా కృషి చేయాలని నిర్ణయించినట్టు పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 12కోట్ల మంది ఓటర్లను గుర్తించి వారితో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్రాలలో వివిధ పార్టీలతో అవసరాన్ని బట్టి పొత్తులు పెట్టుకున్నప్పటికీ, జాతీయస్థాయిలో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. 272 స్థానాలను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జవదేకర్ చెప్పారు. ఇదిలా వుంటే, సీనియర్ రాష్ట్ర నేత బండారు దత్తాత్రేయ మంగళవారం పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు.
గెలుపు కోసం మోడీ వ్యూహం
పార్టీ కీలక సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 206 సీట్లను గెల్చుకుంది. బిజెపి 116 స్థానాల్లో విజయం సాధించింది. చాలా నియోజకవర్గాల్లో మనం రెండో స్థానంలో నిలిచాం. ఈ స్థానాల్లో బీజేపీ కన్నా కాంగ్రెస్ 89 లక్షల ఓట్లు ఎక్కువ సాధించింది. ఈ ఐదేళ్లలో 12 లక్షల ఓటర్లు కొత్తగా వచ్చారు. ప్రస్తుతమున్న ప్రభుత్వ వ్యతిరేకత.. కొత్త ఓటర్ల సహకారంతో రానున్న ఎన్నికల్లో ఈ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా మేజిక్ ఫిగర్ 272ను సాధిద్దామని పార్టీ శ్రేణులకు మోడీ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications