ట్యుటీకోరిన్ లో తీవ్ర ఉద్రిక్తతలు: పోలీసుల కాల్పుల్లో 9మంది మృతి
చెన్నై: చెన్నైలోని ట్యుటీకోరన్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న కాపర్ ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గతకొంతకాలంగా అక్కడ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారంతో వారి నిరసన 100వ రోజుకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో మంగళవారం చుట్టుపక్కల 18గ్రామాల ప్రజలు కలెక్టరేట్ ను ముట్టడించేందుకు బయలుదేరారు. ఆందోళనకారులు కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆపై ఫైరింగ్ చేయడంతో 9 మంది మృతి చెందారు.. పోలీసుల లాఠీచార్జిలో చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు.
పోలీసుల లాఠీచార్జితో ఆగ్రహించిన ఆందోళనకారులు కలెక్టరేట్ భవనానికి నిప్పు పెట్టినట్టు తెలుస్తోంది. కాపర్ ఫ్యాక్టరీ హెడ్ క్వార్టర్స్ కి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టినట్టు సమాచారం. ట్యటీకోరన్ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
కాగా, కాపర్ ఫ్యాక్టరీ ఉండటం వల్ల చుట్టుపక్కల ప్రజలు క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాక్టరీని మూసివేయాల్సిందిగా వారు ఆందోళనలు చేపడుతూ వస్తున్నారు. కాగా, ఘటనపై సిట్టింగ్ జడ్జీతో విచారణకు ఆదేశించారు సీఎం పళనిస్వామి. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల సాయాన్ని ప్రకటించారు.