దేశం ఏమైనా ధర్మ సత్రమా..? అలా నినదించేవాళ్లకే ఇక్కడ చోటు : కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
ఓవైపు విపక్షాలు,ప్రజా సంఘాలు పౌరసత్వ చట్టాలపై ఆందోళనలు,విమర్శలు చేస్తుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటిని గట్టిగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్ఆర్సీ,సీఏఏలను వ్యతిరేకిస్తున్నవారిపై తాజాగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. దేశాన్ని ఓ ధర్మశాల(ధర్మసత్రం) లాగా మార్చాలనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్,బీజేపీ అనుబంధ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎవరిని పడితే వాళ్లను రానిద్దామా..? : ధర్మేంద్ర ప్రధాన్
దేశ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్ వంటి వారు తమ ప్రాణాలను త్యాగం చేశారని ధర్మేంద్ర ప్రధాన్ గుర్తుచేశారు. అలాంటి దేశంలోకి ఎవరిని పడితే వారిని రానిచ్చి.. దేశాన్ని సత్రంలా మార్చేద్దామా? అని ప్రశ్నించారు.
భారత్ మాతాకీ జై అంటేనే..
'భారత్ మాతాకీ జై' అని నినదించేవారు మాత్రమే ఈ దేశంలో ఉండాలని.. ఈ సవాల్ను అందరూ స్వీకరించాలని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇక దేశాన్ని వెంటాడుతున్న నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఏబీవీపీ లాంటి సంస్థలు ఆ దిశగా పరిష్కార మార్గాలను వెతకాల్సిన అవసరం ఉందన్నారు.
అంతకుముందు నితిన్ గడ్కరీ :
ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి అక్రమంగా వలసొచ్చిన ముస్లింలకు తిరిగి వెళ్లిపోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 ఇస్లామిక్ దేశాల్లో.. వారు ఎక్కడికైనా వెళ్లవచ్చునని అన్నారు. కానీ ఆ మూడు దేశాల్లో వివక్ష,హింసకు గురవుతున్న మైనారిటీలకు భారత్ తప్ప మరో ఆప్షన్ లేదన్నారు.
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా.. :
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ముస్లింలు నివసించేందుకు ప్రపంచవ్యాప్తంగా 150 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయని, హిందువులకు మాత్రం ఒక్క భారత్ తప్ప తలదాచుకోవడానికి మరో దేశం లేదని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఎన్ఆర్సీ,సీఏఏలపై బీజేపీ నేతల స్టాండ్ క్లియర్ గానే ఉందని చెప్పాలి. ఎవరెన్ని విధాలుగా విమర్శించినా.. తాము అమలుచేయాల్సింది చేసి తీరుతామన్న సంకేతాలను బీజేపీ నేతలు తమ వ్యాఖ్యల ద్వారా జనంలోకి పంపిస్తున్నారు.