బీహార్ ఎన్నికల సిత్రాలు- లాక్డౌన్ పొడిగింపుపై కులమతాల వారీగా ఓటర్ల చీలిక
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. తొలి దశ పోలింగ్ ముగిసినప్పటికీ రెండోదశ, మూడో దశ పోలింగ్ కోసం వివిధ పార్టీలు, కూటములు హోరాహోరీ ప్రచారం సాగిస్తున్నాయి. అయితే ఈ రెండు దశల్లో ఓటేసేందుకు సిద్ధమవుతున్న వలస కార్మికులు లాక్డౌన్ ప్రభావంపై సైతం కులమతాల వారీగా చీలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బీహార్లో కులమతాల ప్రభావం ఏ స్ధాయిలో ఉంటుందనడానికి ఇదే పెద్ద నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్, తదనంతర పరిస్ధితుల కారణంగా ఉపాధి లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీహారీ యువత కుల, మతాల వారీగా విడిపోయి కూటములకు మద్దతిస్తుండటం విశేషం.
కరోనాపై ఓటరు పైచేయి: ఈసీ సక్సెస్ - ప్రశాంతంగా ముగిసిన ఫస్ట్ ఫేజ్ - బీహార్ పోల్ ఫొటోలివి..
బీహార్ ఎన్నికలపై లాక్డౌన్ ఎఫెక్ట్...
బీహార్లో మూడు విడతలుగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ ముగిసింది. ఇందులో ఓటర్లు ఓ మోస్తరుగా పోలింగ్లో పాల్గొన్నారు. కేవలం 52 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తర్వాతి రెండు దశల పోలింగ్ కోసం ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికలను ప్రభావితం చేస్తున్న ప్రధాన కారణాల్లో కరోనా కారణంగా కేంద్రం విధించిన లాక్డౌన్ కూడా ముందు వరుసలో ఉంది. లాక్డౌన్ కారణంగా లక్షలాది మంది బీహారీ వలస కార్మికులు పనులు కోల్పోయి సొంత రాష్ట్రానికి వచ్చేశారు. దీంతో స్ధూలంగా గమనిస్తే లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారంతా దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణమనే ఆగ్రహంతో ఉన్నారు.
లాక్డౌన్పై భిన్నాభిప్రాయాలు..
లాక్డౌన్కు ముందు బీహార్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఏటా వలస వెళ్లే వారు ఎంత మంది ఉంటారనే అంశంపై కచ్చితమైన సమాచారం లేకపోయినా లాక్డౌన్ సమయంలో మాత్రం 25 నుంచి 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి తిరిగొచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయి. దీంతో బీహారీ ఓటర్లలో బిజిలీ-పానీ-సడక్ ( విద్యుత్-నీరు-రోడ్డు) మాత్రమే అభివృద్ధి కాదనే వాదన పెరుగుతోంది. అంతకుమించి తమ ఉపాధి అవకాశాలు కావాల్సిందేనని నితీశ్ హయాంలో ఇతర రాష్ట్రాలకు వలసపోయిన ఓటర్లు చెబుతున్నారు. అన్నింటికీ మించి కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల నేరుగా ఇబ్బందులు పడుతున్న వారు దీన్ని ప్రభుత్వాలు సమర్దంగా ఎదుర్కోలేకపోయాయని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం విదేశాల నుంచి వచ్చిన కరోనాకు మోడీ మాత్రం ఏం చేస్తారనే వాదన వినిపిస్తున్నారు.
లాక్డౌన్ పొడిగింపుపై కుల, మతాల వారీగా చీలిక...
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ను నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తిస్ధాయిలో తొలగించకపోవడంపై బీహారీ ఓటర్లలో స్ఫష్టమైన చీలిక కనిపిస్తోంది. ఇది కూడా కుల, మతాల వారీగా కావడం మరో విశేషం. బీజేపీ-జేడీయూకు సంప్రదాయ ఓటర్లుగా ఉన్న అగ్రవర్ణాలు, మహాదళిత వర్గాలు లాక్డౌన్ పొడిగింపు అవసరమే అంటుండగా.. ముస్లింలు, బీసీలు, ఇతర వర్గాలు మాత్రం కేంద్రం తీసుకున్న లాక్డౌన్ పొడిగింపు నిర్ణయం ద్వారా తాము సర్వం కోల్పోయామని అంటున్నారు. ఇప్పటికీ పలుచోట్ల ఆంక్షలు కొనసాగుతుండటం వల్ల తమ ఉపాధి వెతుక్కోవడం కష్టంగా మారిందని వీరు చెబుతున్నారు. దీంతో లాక్డౌన్ వంటి జాతీయ స్ధాయిలో ప్రబావం చూపే సమస్యపైనా ఓటర్లలో కుల, మతాల వారీగా చీలిపోయినట్లు అర్ధమవుతోంది.