ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు: బీజేపీపై రాజ్యసభలో విపక్షాల ఆగ్రహం..
ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ మాట్లాడుతూ ఓట్లన్ని బీజేపీకి పడేలా ఈవీఎంలో చిప్ ను అమర్చుతున్పారని అధికార పార్టీపై ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ: ఇటీవలి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం ఈ ఆరోపణలతో గొంతు కలిపారు. ఇక మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లోను ఈవీఎంల ట్యాంపరింగ్ కలకలం రేపింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో రాజ్యసభలో నేడు ఈ అంశం చర్చకు వచ్చింది. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో (ఈవీఎం) ట్యాంపరింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ వాటి రద్దుకు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రానున్న ఢిల్లీ కార్పోరేషన్ ఎన్నికలు, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించవద్దంటూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు.
ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ మాట్లాడుతూ ఓట్లన్ని బీజేపీకి పడేలా ఈవీఎంలో చిప్ ను అమర్చుతున్పారని అధికార పార్టీపై ఆరోపణలు చేశారు. అధికార బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను తప్పుపట్టింది. దీనిపై బదులిస్తూ 2004 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, 2009 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించినప్పుడు ఎస్పీ గెలిచిందని కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గుర్తుచేశారు.
ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయన్న అనుమానాలు ఉంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని, సభా సమయాన్ని వృథా చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్లో కలకలం:
మధ్యప్రదేశ్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికల నేపథ్యంలో ఈవీఎం మెషీన్ ల పనితీరును ఆయా పార్టీల ఏజెంట్లకు ఎన్నికల అధికారులు చూపించారు. ఆశ్చర్యంగా ఏ బటన్ నొక్కినా.. బీజేపీకే ఓటు పడేలా ఈవీఎం మెషీన్ పనిచేయడం అందరిని విస్మయానికి గురిచేసింది. దీంతో ఏపీ ఎన్నికల అధికారి భన్వర్ లాల్ వాటి పనితీరును సమీక్షించేందుకు అక్కడికి వెళ్లారు.
ట్యాంపర్ అయినట్టు చెప్పబడుతున్న ఈవీఎం ఎందుకలా ప్రవర్తించిందన్న విషయాన్ని తమ సాంకేతిక నిపుణులు గుర్తించారని తెలిపారు. ఇటీవలి ఉత్తరప్రదేశ్, కాన్పూర్ పరిధిలోని గోవిందనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లలోను ఈ ఈవీఎంలను వాడినట్లు చెప్పారు.
వీవీపీఏటీ (వోటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్) నుంచి తొలగించాల్సిన డేటాను తీసివేయలేదని, దీనివల్ల సాంకేతికంగా గోవిందనగర్ లో పోటీపడ్డ వారి పేర్లే ఈవీఎంలలో ఉండిపోయాయని అన్నారు. దీంతో ఎవరికి ఓటు వేసినా, అది ఆ స్థానంలో గతంలో ఉన్న బీజేపీకి ఓటు వచ్చినట్టు చూపిందన్నారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులను బదిలీ చేసినట్లు చెప్పారు. నమోదైన ఓట్ల సంఖ్య సరిపోతేనే ఫలితం వెలువడుతుందని భన్వర్ లాల్ తెలిపారు.