రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ పై ప్రతిష్టంభన-విపక్షం విస్తృత చర్చలు-క్షమాపణకు కేంద్రం డిమాండ్
రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ పై ఇవాళ కూడా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే ఎంపీల సస్పెన్షన్ కు నాలుగు రోజులు పూర్తికావడంతో విపక్షాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విపక్ష ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ ఇవాళ సస్పెండైన ఎంపీలతో కలిసి ధర్నాలో కూర్చుని సంఘీభావం తెలిపారు. మరోవైపు వీరి సస్పెన్షన్ ఎత్తివేతపై కేంద్రంతో విపక్షాలు చర్చిస్తున్నాయి.
12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేతపై కేంద్రంతో పాటు విపక్షాలు కూడా పట్టువీడటం లేదు. వారితో క్షమాపణ చెప్పిస్తే సస్పెన్షన్ ఎత్తేస్తామని కేంద్రం ప్రతిపాదిస్తుండగా.. వారిని ఏ నిబంధన కింద సస్పెండ్ చేశారో చెప్పాలని విపక్షం కోరుతోంది. అలాగే వారి సస్పెన్షన్ ఎత్తివేతకు క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ను తోసిపుచ్చుతోంది. దీంతో ఇవాళ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీతో విపక్ష నేతలు జరిపిన చర్చలు సఫలం కాలేదు.

వారిని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో వివరించామని, ఏం జరిగిందో దేశం చూసిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇది రికార్డులోకి ఎక్కిందన్నారు. సస్పెండైన ఎంపీలు ఇవాళ కూడా క్షమాపణ చెబితే, సస్పెన్షన్ను ఉపసంహరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
అటు రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ప్రభుత్వంతో వీరి సస్పెన్షన్ ఎత్తివేత కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇవాళ రాజ్యసభలో తలెత్తిన అడ్డంకులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. సభను సజావుగా నడిపేందుకు తాము చాలా ప్రయత్నించామన్నారు. రూల్ 256 ప్రకారం మాత్రమే ఎంపీలను సస్పెండ్ చేయవచ్చనే మా అభిప్రాయాలను తెలియజేయడానికి మేము సభా నాయకుడిని, ఛైర్మన్ను పదేపదే కలిశామని ఆయన వివరించారు. అయినా ప్రభుత్వం మెండికేస్తుందన్నారు. దీంతో రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications