పార్లమెంట్ ను కుదిపేస్తున్న పెగాసస్- ప్రధాని మోడీ, షా సమక్షంలో చర్చకు విపక్షాల పట్టు
పెగాసస్ సైబర్ దాడి వ్యవహారం వరుసగా ఆరో రోజూ పార్లమెంటును కుదిపేసింది. జీరో అవర్ లో పెగాసస్ పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సమక్షంలోనే పెగాసస్ పై చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అదే సమయంలో దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ అంశంపై జ్యుడిషయల్ దర్యాప్తు జరిపించాలని కోరాయి.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఆరోరోజైన ఇవాళ ఉభయ సభల్లోనూ విపక్షాలు పెగాసస్ పై చర్చకు పట్టుబట్టాయి. ఉదయం సభా కార్యకలాపాల్ని అడ్డుకుని పెగాసస్ పై చర్చకు డిమాండ్ చేశాయి. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా లోక్ సభలోకి రావడంతో వారి సమక్షంలో చర్చ జరగాలని పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్షాలకు అవకాశం ఇస్తానని స్పీకర్ ఓం బిర్లా హామీ ఇచ్చినా నిరసనలు సద్దుమణగలేదు. దీంతో నిరసనల మధ్యే సభా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

అటు రాజ్యసభలోనూ ఛైర్మన్ వెంకయ్య నాయుడు పెగాసస్ పై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో పెగాసస్ పై చర్చ కోరుతూ నినాదాలు చేస్తున్న విపక్ష ఎంపీల తీరుపై మాట్లాడుతూ వెంకయ్య.. పార్లమెంటు ఉన్నది చట్టాలు చేసేందుకేనని, విపక్షాలు అంతరాయం కలిగించడం సరికాదన్నారు. కానీ పార్లమెంటును అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. విపక్షాల ఆందోళల మధ్యే సభను ఆయన మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు పెగాసస్ పై చర్చ కోసం ఉభయసభల్ని అడ్డుకుంటున్న విపక్షాలపై అధికార బీజేపీ మండిపడింది.












Click it and Unblock the Notifications