రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ పై ఏకమైన విపక్షం-ఇరుసభల ఎంపీలతో ర్యాలీకి నిర్ణయం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. అయితే రాజ్యసభలో విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ వ్యవహారంలో మాత్రం కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో విపక్షాలు ఇవాళ కూడా రాజ్యసభలో దీనిపై నిరసన తెలిపాయి. కేంద్రంతో పాటు రాజ్యసభ ఛైర్మన్ కూడా మౌనం వహిస్తుండటంతో ఇక చేసేది లేక ఢిల్లీలో ర్యాలీ నిర్వహించాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయి.
ఇవాళ ఉదయం రాజ్యసభ సమావేశం కాగానే విపక్ష ఎంపీలు రోజూ లాగే నిరసనలు తెలిపారు. విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య మాత్రం మౌనం వహించారు. నిరసనలు వదిలి ఎంపీలు తమ స్ధానాల్లో కూర్చోవాలని కోరారు. సభా మర్యాదను కాపాడుకుందామని, వికృత, అన్పార్లమెంటరీ ప్రవర్తన అస్సలు పని చేయదని వెంకయ్య విపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిరసనల మధ్యే రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

అనంతరం సమావేశమైన విపక్ష ఎంపీలు తాజా పరిస్ధితిపై చర్చించారు. రాజ్యసభతో పాటు లోక్ సభలో ఉన్న తమ పార్టీ ఎంపీలతో కలిసి ఓ ర్యాలీ నిర్వహించి నిరసన తెలపాలని ఎంపీలు నిర్ణయించారు. సస్పెండ్ అయిన రాజ్యసభ ఎంపీలకు మద్దతుగా కవాతు నిర్వహించాలని నిర్ణయించిన విపక్షాలు ఆ మేరకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేశాయి. కొన్నిరోజులుగా ఎంపీలు ధర్నా నిర్వహిస్తున్న పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకూ ఈ కవాతు నిర్వహించాలని విపక్ష ఎంపీలు నిర్ణయించారు. ఇవాళ ఈ కవాతు నిర్వహించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
సస్పెండైన 12 మంది ఎంపీల్లో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, తృణమూల్ కాంగ్రెస్, శివసేన నుండి ఇద్దరేసి, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్క ఎంపీ ఉన్నారు. వీరంతా వారం రోజులుగా నిత్యం పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తూ నిరసన తెలుపుతున్నారు. తమకు న్యాయం కావాలని డిమాండ్లు చేస్తున్నారు. అయినా కేంద్రం కానీ, రాజ్యసభ ఛైర్మన్ గానీ వారి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవడం లేదు.












Click it and Unblock the Notifications