రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ ప్రతిష్టంభన-తగ్గేందుకు వెంకయ్య ససేమిరా-విపక్షం వాకౌట్
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సగం రోజులు పూర్తయినా రాజ్యసభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. సభలో దురుసు ప్రవర్తన పేరుతో కేంద్రం సూచన మేరకు 12 మంది ఎంపీల్ని సస్పెండ్ చేసిన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు.. వారి నుంచి క్షమాపణ వచ్చే వరకూ సస్పెన్షన్ ఎత్తివేత కుదరదంటున్నారు. కానీ ఏ నిబంధనల ప్రకారం తాము క్షమాపణ చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు. తప్పు చేయనందున తాము క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదంటున్నారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య కూడా వెనక్కి తగ్గనని భీష్మించుకుని కూర్చున్నారు.
ఇవాళ పార్లమెంటు శీతాకాల సమావేశాల 12వ రోజు కూడా రాజ్యసభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ వ్యవహారాన్ని విపక్షాలు లేవనెత్తాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఈ వ్యవహారం లేవనెత్తారు. ప్రతీ రోజూ విపక్ష ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత కోరుతున్నామని, అయినా ఛైర్మన్ మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. అయినా రాజ్యసభ ఛైర్మన్ మాత్రం నిరసనలకు కూడా అనుమతించలేదు. మరోవైపు ప్రతిపక్షం చేసిన పనికి పశ్చాత్తాపం లేదని రాజ్యసభలో అధికారపక్ష నేత పీయూష్ గోయల్ ఆరోపించారు. కాశీలో ఆలయ నిర్మాణం ప్రారంభమైన అటువంటి పవిత్రమైన రోజున కూడా వారు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ప్రతిపక్ష ఎంపీల నినాదాల మధ్య గోయల్ అన్నారు.
దీంతో తాము సభ నుంచి వాకౌట్ చేయడం మినహా మరో మార్గం లేదని విపక్ష నేత ఖర్గే తెలిపారు. అనంతరం కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్ష పార్టీలు కూడా రాజ్యసభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయాయి.

ఇప్పటికే సస్పెండైన రాజ్యసభ ఎంపీలు పార్లమెంట్ బయట ధర్నా కొనసాగిస్తుండగా.. మరోవైపు వీరికి విపక్ష ఎంపీలు రోజూ కలిసి సంఘీభావం ప్రకటిస్తూనే ఉన్నారు. వీరిపై సస్పెన్షన్ ఎత్తేయాలని కేంద్రాన్ని కూడా కోరుతూనే ఉన్నారు. పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషీతో పాటు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యతోనూ పలుమార్లు విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే భేటీ అయ్యారు. కానీ ప్రభుత్వం మాత్రం సస్పెండైన ఎంపీలు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. దీంతో రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications