నేను తలుచుకుంటే: శశికళకు పన్నీరు సెల్వం తీవ్ర హెచ్చరిక
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అన్నాడీఎంకే అధినేత్రి శశికళ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఆదివారం నాడు శశికళ గోల్డెన్ రిసార్ట్ ఎదుట ఎమ్మెల్యేలతో మీడియా ఎదుట పరేడ్ నిర్వహించారు.
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అన్నాడీఎంకే అధినేత్రి శశికళ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఆదివారం నాడు శశికళ గోల్డెన్ రిసార్ట్ ఎదుట ఎమ్మెల్యేలతో మీడియా ఎదుట పరేడ్ నిర్వహించారు. దీనిపై పన్నీరు స్పందించారు.
మహిళా జర్నలిస్ట్ల్ని చితకబాదిన శశికళ వర్గం: రిసార్టులో చిన్నమ్మ-ఎమ్మెల్యేల కంటతడి
మొదట వారిని అక్కడి నుంచి స్వేచ్ఛగా వదిలేయాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యేలను వారి వారి నియోజకవర్గాలకు పంపించాలని చెప్పారు. ఈ రోజు కూడా ఎమ్మెల్యేలు తనను కలిశారని, ప్రతి ఎమ్మెల్యే వద్ద నలుగురు గూండాలు ఉన్నారని చెప్పారని తెలిపారు.
అవమానాలు ఎదుర్కొన్నా
శశికళ నుంచి ఎన్నో అవమానాలను చవిచూశానని, ఎన్ని మాటలన్నా భరించానని, కానీ పార్టీని కబళిస్తానంటే మాత్రం సహించేది లేదని, అడ్డుకొని తీరుతానని పన్నీరు సెల్వం హెచ్చరించారు. రాష్ట్ర హోంశాఖ బాధ్యతలూ చూస్తున్న ఆయన.. తాను తలుచుకొంటే శశికళ బంధించిన ఎమ్మెల్యేలను ఇప్పటికిప్పుడు విడిపించగలనన్నారు.
అందుకే వెయిటింగ్
అసాధారణ పరిస్థితులకు తావు ఇవ్వరాదన్న కారణంతో తాను వెయిట్ చేస్తున్నానని చెప్పారు. పార్టీని కాపాడుకోవడానికి ఎంతదూరమైనా పోరాడతానన్నారు. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తే నెగ్గి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.
శశికళ మొసలి కన్నీరు
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చాలా స్వేచ్ఛగా ఉన్నారని, వారిపై ఎలాంటి ఒత్తిడీ లేదన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ప్రకటనపై పన్నీరు సెల్వం నిప్పులు చెరిగారు. శశికళ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేలను స్వేచ్ఛగా విడిచిపెట్టి వారి నియోజకవర్గాలకు పంపాలని కోరారు.
బలవంతంగా బందించారు
ప్రజలు ఎన్నుకొన్న ఎమ్మెల్యేలను బలవంతంగా రిసార్టుల్లో బంధించారని, ఒక్కో ఎమ్మెల్యే వద్ద నలుగురు గూండాలను కాపలా పెట్టారని, కాదని శశికళ అనే పక్షంలో వారున్న రిసార్టుల వద్దకు ఆమె రెండోసారి ఎందుకువెళ్లారో చెప్పాలని సవాల్ విసిరారు.
పన్నీరు ఆగ్రహం
తనను దుష్టశక్తిగా శశికళ పేర్కొనడంపై పన్నీరు సెల్వం ఘాటుగా స్పందించారు. అమ్మ మృతి చెందిన రోజున, వద్దన్నా పట్టుబట్టి మరీ శశికళ తనను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారని, ఈ రెండు నెలలుగా అవమానాలకు గురి చేస్తూనే ఉన్నారని చెప్పారు.
నాతో టచ్లో ఎమ్మెల్యేలు
అన్యాయం పైన గొంతెత్తగానే దుష్టశక్తిగా నన్ను చిత్రీకరిస్తున్నారని పన్నీరు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు మంత్రులు, శాసనసభ్యులు నాతో టచలో ఉన్నారని, వారంతా ఏ క్షణంలోనైనా ముందుకొచ్చి మద్దతు తెలపటం ఖాయమని చెప్పారు.
పన్నీరు నిలదీత
వైద్యచికిత్స అందించిన 75 రోజులపాటు జయలలిత వెంట తాను ఉన్నట్టు చెబుతున్న శశికళ.. ఏనాడైనా ఆమె ఆరోగ్యంపై ప్రజలకు సమాచారం ఇచ్చారా అని పన్నీరు నిలదీశారు. అమ్మ మృతిపట్ల రాష్ట్ర ప్రజానీకమంతా ఆందోళన చెందుతున్నా ఆసుపత్రిలో ఆమెకు అందిన చికిత్సపై శశికళ ఒక్క మాటా చెప్పలేదని దుయ్యబట్టారు.
వారసురాలు దీప
జయలలిత వారసురాలిని తానే అని శశికళ ప్రకటన చేయడాన్ని పన్నీరు సెల్వం కొట్టిపారేశారు. వారసత్వంపై శశికళ వర్గీయుల వాదన వింతగా ఉందని, అమ్మ సోదరుడి కుమార్తె దీప, కుమారుడు దీపక్ మాత్రమే వారసులు అవుతారని చెప్పారు.
ఎమ్మెల్యే చుట్టూ గూండాలు
శశికళది మొసలి కన్నీరని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎద్దేవా చేశారు. ప్రతిరోజూ తనపై బురద చల్లినా ఆమెకు ఏమీ ప్రయోజనం ఉండబోదని చెప్పారు. తన బలం అసెంబ్లీలో నిరూపించుకుంటానని చెప్పారు. ఇన్నేళ్లు ఒక్క జయలలిత అమ్మ మాత్రమే తనకు మద్దతుగా నిలిచారని, మిగతా వారంతా వేధించారన్నారు. ఎమ్మెల్యేలున్న గోల్డెన్ బే రిసార్ట్కు శశికళ ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు.