ఆశ్చర్యం: గంగానదిలో తేలిన వందకుపైగా శవాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ - ఉన్నావో మధ్యలో గంగా నదిలో అకస్మాత్తుగా 100కు పైగా మృతదేహాలు మంగళవారనాడు బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై సమాచారం అందుకున్న కాన్పూర్ అధికారులు విచారణకు ఆదేశించారు. గంగానదిలో మృతదేహాలను వేయడం సర్వసాధారణమని, గంగా ప్రవాహం తగ్గటంతోనే ఇలా ఒక్కసారిగా మృతదేహాలు తెలాయని అధికారులు భావిస్తున్నారు.
నదిలో తేలిన శవాలకు దహన సంస్కారాలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మోక్షం లభిస్తుందనే నమ్మకంతో గంగానదిలో శవాలను నిమజ్జనం చేసి ఉంటారని, అయితే అకస్మాత్తుగా ఇంత పెద్ద యెత్తున శవాలు కనిపించడంతో ఆశ్చర్యపోయారని అంటున్నారు.
అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించడానికి అదనపు పోలీసు సూపరింటిండెంట్, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ ఆ ప్రాంతానికి వెళ్లారు. గంగానదిలో నీరు తగ్గిందని, అందుకే శవాలు తేలి ఉంటాయని ఉన్నావో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సర్యూ ప్రసాద్ అన్నారు.
ఆ సంఘటనతో గంగానదిలో మృతదేహాల నిమజ్జనానికి వ్యతిరేకంగా పర్యావరణ సంఘాలు గొంతు ఎత్తాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరుడు జులైలో గంగా ప్రక్షాళణ శాఖను ఏర్పాటు చేసి, రూ.2037 కోట్లు కేటాయించారు.