జైలులో ఉన్నా కరోనా వదల్లేదుగా: 44 శాతం మంది ఖైదీలకు పాజిటివ్: ఎలా సోకిందో అర్థం కాక
గువాహటి: బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా.. నాలుగు గదుల మధ్య బందీలుగా ఉంటోన్న ఖైదీలకు కూడా వదలట్లేదు ప్రాణాంతక కరోనా వైరస్. అయిదు.. పదీ కాదు.. వందల మందికి కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ బారిన పడిన ఖైదీల్లో ఏ ఒక్కరు కూడా పెరోల్ మీద గానీ.. ఇంకేదైనా కారణాల మీద గానీ విడుదలైన వారు కాదు. విచారణ ఎదుర్కొంటోన్న వారు, శిక్షను అనుభవిస్తోన్న ఖైదీలే. ఇంతమందికి కరోనా వైరస్ సోకడంపై అధికారులు నిర్ఘాంత పోతున్నారు. దీనికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. నిత్యావసర సరుకులను తీసుకుని వచ్చే వారి ద్వారా సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
జగన్ సర్కార్ ప్లాన్: అమరావతి భూములు అమ్మకానికి: సింగపూర్ కన్సార్టియం నుంచి వెనక్కి
అసోంలోని గువాహటి సెంట్రల్ జైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ జైలులో మొత్తం 984 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 535 మందికి వైరస్ సోకిందని అస్సాం జైళ్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ దశరథ్ దాస్ తెలిపారు. వారికి మెరుగైన చికిత్సను అందించాలంటూ హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. జైలులోనే కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. 200 పడకల సామర్థ్యంతో కోవిడ్ సెంటర్ను నెలకొల్పడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
Recommended Video
కరోనా వైరస్ బారిన పడిన వారిలో అస్సాం ఉద్యమ నాయకుడు అఖిల్ గగోయ్, స్టూడెంట్ యాక్టివిస్ట్ షర్జీల్ ఇమాం ఉన్నారు. అస్సాంలో వేర్వేరు జిల్లాల్లోని కారాగారాల్లోనూ వైరస్ లక్షణాలు కనిపించిన ఖైదీలు ఉన్నారని, వారికి చికిత్సను అందిస్తున్నట్లు చెప్పారు. ఒక్క గువాహటి సెంట్రల్ జైలులోనే 535 మందికి కరోనా సోకిందని దశరథ్ దాస్ తెలిపారు. అసింప్టొమేటిక్ ఖైదీలను నగమ్ ప్రత్యేక జైలులో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. జైళ్లలోని ఖైదీలందరికీ కరోనా పరీక్షలను పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విచారణలో ఉన్న కొందరు ఖైదీలను విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.