కోతులకు విషం పెట్టి.. గోనె సంచుల్లో వేసి దారుణంగా కొట్టి అమానుషం.. 30 కోతులు మృతి
నోరులేని మూగజీవాలని తెలిసికూడా అన్నీ తెలిసిన మానవులు దారుణానికి పాల్పడ్డారు. అత్యంత దారుణంగా కోతులను హతమార్చారు. కోతులకు విషం పెట్టి గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టిన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లా బేలూరు సమీపంలో చౌడనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనలో 30 కోతులు మరణించినట్లుగా తెలుస్తోంది .

కోతులపై అమానుషం ... కర్ణాటకలో దారుణ ఘటన
ఈరోజు ఉదయం చౌడనహళ్లి గ్రామంలో రోడ్డు పక్కన కొన్ని గోనెసంచుల మూటలను గమనించిన స్థానిక యువకులు వాటిని విప్పి చూడగా అందులో కోతులు కనిపించాయి. అప్పటికే కొన్ని సంచులలో ఉన్న కోతులు మరణించగా, మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాయి.ఊపిరాడక ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ కోతులను చూసి ఒక్కసారిగా స్థానికులు షాక్ కు గురయ్యారు. వాటి పరిస్థితి చూసి ఆవేదన చెందారు. మొత్తం సంచులలో 50 కోతులను బంధించి కొట్టినట్టుగా తెలుస్తోంది. అందులో 30 కోట్లు మరణించగా, 20 కోతులు ప్రాణాలతో బయట పడ్డాయి.

గోనె సంచుల్లో కోతులు.. కొన్నిటిని కాపాడిన స్థానిక యువత
మూటలు విప్పి యువకులు గాయపడిన కోతులను బయటకు తీసి వాటికి నీళ్ళు తాగించి ప్రథమ చికిత్స చేశారు. గాయపడిన కోతులలో పద్దెనిమిది కోతులు కోలుకోగా, రెండు కోతులు తీవ్రంగా గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకోవడంతో, ఆ రెండు కోతులను వెటర్నరీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని కోతులను హతమార్చిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video
కోతులకు విషమిచ్చినట్టు పోస్ట్ మార్టం నివేదిక .. వారిపై చర్యలకు నటుడు రణదీప్ హుడా డిమాండ్
కోతులకు విషం పెట్టి, సంచులలో కుక్కి ఇష్టమొచ్చినట్లుగా కొట్టారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరణించిన కోతుల పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా కోతులకు విషప్రయోగం జరిగిందని తేలింది. ఈ అమానుష ఘటనకు పాల్పడిన వారు ఎవరన్న దానిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ నటుడు రణదీప్ హుడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోతులను ఇంత దారుణంగా హింసించి చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రణదీప్ హుడా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications