కుంభమేళాలో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు.. మరిన్ని ప్రత్యేక రైళ్లు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా మహాకుంభమేళాకు పేరుంది. ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతున్నారు. మంగళవారం సాయంత్రానికి దాదాపు 55 కోట్ల మందికి పైగా భక్తులు గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు.ఈ విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ధ్రువీకరించింది. భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని తెలిపింది. ఫిబ్రవరి 26 నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఊహించని రీతిలో భక్తులు తరలివస్తున్నారని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
"ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక తీర్థయాత్ర, సాంస్కృతిక-సామాజిక కార్యక్రమం. ఇప్పటికే 55 కోట్ల మందికిపైగా మహాకుంభ మేళాలో పుణ్యస్నానాలు చేశారు. ఫిబ్రవరి 14 నాటికే 50 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తాజాగా 55 కోట్ల మార్కును చేరుకుంది. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది,మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది, జనవరి 30న రెండు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు" అని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.

ఏఏఐతో శాంతిభద్రతలు..
మహాకుంభమేళాలో శాంతిభద్రతలకు అవాంతరం కలగకుండా యూపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఏఐతో కూడిన అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఏఐతో అనుసంధానమైన డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, సమాచార కేంద్రాల ద్వారా భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ అలరించేలా ఏర్పాటు చేసిన పౌరాణిక గాథలతో కూడిన ప్రత్యేక ప్రదర్శనలు మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ప్రత్యేక రైళ్లు..
ఇక కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం- గోరఖ్పూర్(08588) స్పెషల్ ఈ నెల 10, 22వ తేదీల్లో రాత్రి 10.20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. ఈ నెల 12, 24వ తేదీల్లో రాత్రి 7.30 గంటలకు గోరఖ్పూర్ చేరుకుంటుంది. గోరఖ్పూర్- విశాఖపట్నం(08587) స్పెషల్ ఈ నెల 13, 25వ తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరి 15, 27వ తేదీల్లో మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications