ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ 70 శాతం కచ్చితం- సీరం ఇన్స్టిట్యూట్తో కలిసి భారత్లో ఉత్పత్తికి రెడీ...
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేసిన వ్యాక్సిన్ ప్రయోగాలు సఫలమైనట్లే కనిపిస్తోంది. ఈ వ్యాక్సిన్ వాడకం వల్ల రోగి శరీరంపై ఎలాంటి ఇతర ప్రభావాలు లేవని తాజాగా ఆస్ట్రాజెనెకా సంస్ధ ప్రకటించింది. బ్రిటన్, బ్రెజిల్లో నిర్వహించిన ప్రయోగాలు 70 శాతం మేర కచ్చితమైన ఫలితాలు ఇచ్చాయని వెల్లడించింది.
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను తొలుత సగం డోస్, నెల రోజుల విరామం తర్వాత మరో ఫుల్ డోస్ను రోగులపై పరీక్షించారు. ఇందులో తాజా డోస్లో 90 శాతం మేర కచ్చితమైన ఫలితాలు వచ్చాయని ఆక్స్ఫర్డ్ ప్రకటించింది. ఈ రెండు డోసుల ప్రయోగాల్లోనూ ఎక్కడా తీవ్ర ప్రతికూల ఫలితాలు రాలేదని తెలిపింది. దీంతో ప్రస్తుతం వివిధ దేశాల్లో రోగులు ఎదుర్కొంటున్న కోవిడ్ వైరస్పై ఇది సమర్ధవంతంగా పనిచేస్తుందని ఆస్ట్రాజెనెకా సంస్ధ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కల్ స్కోరియాట్ అన్నారు.
ఈ వ్యాక్సిన్ను ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లు తయారు చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్తో పాటు గేట్స్ ఫౌండేషన్, గవీ వ్యాక్సిన్ అలయన్స్ సంస్ధలతో కలిసి ఆస్ట్రాజెనెకా ప్రపంచవ్యాప్తంగా అందించబోతోంది. భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ సాయంతో వ్యాక్సిన్ పంపిణీ చేయబోతున్నారు. ఆక్స్ఫర్డ్ రెండుసార్లు ప్రయోగించిన డోస్ల సగటు చూసుకుంటే దాదాపు 70 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. యూఎస్కు చెందిన మోడర్నా సంస్ధ తమ వ్యాక్సిన్ 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.