ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ .. 22 మంది కరోనా రోగులు మృతి .. నాసిక్ లో ఘోరం !!
దేశంలో కరోనా మహమ్మారి ప్రళయం సృష్టిస్తోంది . విపరీతంగా పెరుగుతున్న కేసులతో ఆసుపత్రులు క్రిక్కిరిసిపోతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్ సరఫరా, వైద్య సదుపాయాల కొరత తీవ్రంగా నెలకొంది. ఆక్సిజన్ కొరతతో దేశ రాజధాని ఢిల్లీ అల్లకల్లోలంగా మారింది. ఇదిలా ఉంటే నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ ను నింపుతుండగా ట్యాంకర్ లీకై 22 మంది కరోనా రోగులు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
Recommended Video
మహా విలయం : కరోనా దెబ్బకు మహారాష్ట్రలో సంపూర్ణ లాక్ డౌన్ , నేడే ప్రకటన !!
జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లీక్
కరోనా వైరస్ శ్వాసవ్యవస్థ మీద తీవ్రంగా ప్రభావం చూపడంతో వైరస్ బారిన పడినవారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారికి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు వైద్యులు.
ఈ కారణంగా ఆసుపత్రిలో ఆక్సిజన్ కి తీవ్ర కొరత నెలకొంది . కరోనా కేసుల పెరుగుదల కారణంగా వివిధ ఆస్పత్రులలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్న నేపథ్యంలో తిరిగి వాటిని నింపే ప్రయత్నం చేస్తోంది సర్కార్ . తాజాగా మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో గల జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలోని ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ట్యాంకర్ లోకి ఆక్సిజన్ నింపుతుండగా ట్యాంకర్ లీక్ అయింది .
ఆక్సిజన్ అందక 22మంది కరోనా రోగులు మృతి
ఈ ఘటనలో 22మంది కరోనా రోగులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది
. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రి మరియు స్థానిక పరిపాలన అధికారులు లీక్ను మూసివేయడానికి చర్యలు చేపట్టారు . అగ్నిమాపక విభాగం సహాయంతో లీకేజీని పరిష్కరించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో ఆక్సిజన్ సపోర్టుతో వెంటిలేషన్ మీద ఉన్న రోగుల పరిస్థితి క్షీణించింది . దాదాపు అరగంట సేపు వారికి ఆక్సిజన్ అందలేదు. దీంతో వారు మృత్యువాత పడ్డారు.
22 మంది మృతి చెందారని నిర్ధారించిన నాసిక్ జిల్లా కలెక్టర్
ఆక్సిజన్ అందని కారణంగా ఈ రోజు ఇరవై రెండు కోవిడ్ -19 మంది రోగులు మరణించారని నాసిక్ జిల్లా కలెక్టర్ తెలిపారు. సుమారు 30 నిమిషాల పాటు ఆక్సిజన్ అందలేదని తెలిపారు .
"ప్రస్తుత సమాచారం ప్రకారం, జాకీర్ హుస్సేన్ మునిసిపల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా అంతరాయం కారణంగా 22 మంది మరణించారు" అని జిల్లా కలెక్టర్ సూరజ్ మంధారే వెల్లడించారు . ఆక్సిజన్ అవసరమయ్యే 80 మందిలో 31 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు.
విచారణకు ఆదేశించిన సర్కార్
మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే మాట్లాడుతూ, లీకేజీ కారణంగా ఆసుపత్రి లోపల ఆక్సిజన్ సరఫరా ప్రభావితమైందని , ఆసుపత్రి యాజమాన్యం దీనిపై సమాధానం చెప్పాలని, విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. నాసిక్లో ట్యాంకర్ లీకేజ్ కారణంగా, భారీ ఆక్సిజన్ లీకేజీ జరిగినట్లుగా తెలుస్తోందని ఆయన తెలిపారు . ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో 171 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటన చాలా దురదృష్టకరమైన ఘటనగా ఎఫ్ డీఏ మంత్రి డాక్టర్ రాజేంద్ర షింగనే తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటి వరకు 22మంది మరణించారని ఆయన పేర్కొన్నారు . ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లుగా తెలిపారు.