చినజీయర్ స్వామికి పద్మ భూషణ్- కీరవాణి ఇక పద్మశ్రీ: ఏపీ, తెలంగాణల నుంచి లిస్ట్ ఇదే
న్యూఢిల్లీ: ఇంకొన్ని గంటల్లో దేశం.. 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. దేశ రాజధానిలో ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా పలు చారిత్రాత్మక, స్మారక కట్టడాలను మువ్వన్నెల విద్యుద్దీపాలతో అలంకరించారు. త్రివర్ణాలతో మెరిసిపోయేలా చేశారు. రాజ్ పథ్ లో ఇప్పటికే పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్స్ కూడా ముగిశాయి. ఈ సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల జాబితాను ప్రకటించింది. రెండో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు కోసం ఆరుమందిని ఎంపిక చేసింది. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ చీఫ్ ప్యాట్రన్ దివంగత ములాయం సింగ్ యాదవ్ కు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామివారికి పద్మ భూషణ్ అవార్డు లభించింది. తెలంగాణ నుంచి ఆయన పేరును ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. గత ఏడాదే శంషాబాద్ సమీపంలో 216 అడుగుల రామానుజం విగ్రహాన్ని స్థాపించిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు కోటా నుంచి ప్రఖ్యాత గాయని వాణీ జయరాంకు పద్మ భూషణ్ లభించింది.
ఇక ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ మహలనబిస్, సంగీత కళాకారుడు ఉస్తాద్ జకీర్ హుస్సేన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ, శ్రీనివాస్ వరదన్, బాలకృష్ణ దోషి- పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. కర్ణాటకకు చెందిన సుధా మూర్తి, దేశీయ పారిశ్రామిక దిగ్గజం కుమారమంగళం బిర్లా, ప్రముఖ సాహితీవేత్త ఎస్ ఎల్ బైరప్ప, దీపక్ ధర్, సుమన్ కల్యాణ్పూర్, కపిల్ కపూర్, తెలంగాణ నుంచి కమలేష్ డీ పటేల్
స్టార్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలాకు మరణానంతరం పద్మశ్రీ అవార్డు లభించింది. ఈ జాబితాలో మొత్తం 91 మంది ఉన్నారు. వారిలో సంగీత దర్శకుడు ఏపీ నుంచి ఎంఎం కీరవాణి, నటి రవీనా టాండన్ ఉన్నారు. తెలంగాణ నుంచి మోదడుగు విజయ్ గుప్తా, ఏపీ నుంచి గణేష్ నాగప్ప కృష్ణరాజనగర, తెలంగాణ నుంచి హనుమంతరావు పసుపులేటి, ఏపీ నుంచి సీవీ రాజు, అబ్బారెడ్డి నాగేశ్వర రావు, బీ రామకృష్ణా రెడ్డి, కోట సచ్చిదానంద శాస్త్రి, సంకురాత్రి చంద్రశేఖర్, ప్రకాష్ చంద్ర సూద్ ఉన్నారు.