పాకిస్థాన్లో 100 ఏళ్ల నాటి ఆలయం ధ్వంసం.. భారత్ ఫైర్!
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఓ ప్రాచీన హిందూ దేవాలయాన్ని కూల్చివేయడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తక్షణమే పారదర్శక విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కూల్చివేసిన ఆలయాన్ని పునరుద్ధరించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది.
పాకిస్థాన్లోని నారోవాల్ జిల్లా సిరాజ్ గ్రామంలో ఉన్న ఈ చారిత్రక ఆలయం దాదాపు 100 నుంచి 125 ఏళ్ల క్రితం నిర్మించబడినట్లు తెలుస్తోంది. ఆగస్టు 21న ఈ ఆలయ నిర్మాణాన్ని కూల్చివేశారు. స్థానిక మతపరులు ఆలయ భూమిని సమీపంలోని మదర్సాలో విలీనం చేసేందుకు ఈ దారుణానికి ఒడిగట్టారని స్థానిక మైనారిటీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగానే ఆలయ నిర్మాణం కూలిపోయిందని పాకిస్థాన్ ఆస్తుల సంరక్షణ బోర్డు పేర్కొంది.

ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. మైనారిటీల శతాబ్ధాల నాటి పూజా స్థలాన్ని ధ్వంసం చేయడం అత్యంత నిందనీయమని ఆయన అన్నారు. ఆలయ భద్రతలో పాకిస్థాన్ అధికారులు ఘోరంగా విఫలం అయ్యారని.. ఆ దేశంలో మైనారిటీ వర్గాలు ఎదుర్కొంటున్న అభద్రతా భావానికి ఈ సంఘటన నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
పాక్ ప్రభుత్వం కేవలం విచారణకే పరిమితం కాకుండా మైనారిటీల మత స్వేచ్ఛను, వారి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యతను నెరవేర్చాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ధ్వంసమైన ఆలయాన్ని తిరిగి నిర్మించి.. మైనారిటీ పౌరుల భద్రతను తక్షణమే పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications