'పట్టిస్తా': దావూద్కు ఆర్మీ కమెండోలతో భద్రత పెంచిన పాక్
న్యూఢిల్లీ: ఇండోనేషియాలోని బాలి నుంచి మాఫియా డాన్ ఛోటా రాజన్ను భారత్కు తీసుకొస్తున్న నేపథ్యంలో అండర్ వర్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ భద్రత పెంచింది.
ఇంటిలిజెన్స్ నివేదికల ప్రకారం ఇస్లామాబాద్, కరాచీల్లో దావూద్ నివాసాల వద్ద పాక్ ఆర్మీ స్పెషల్ కమెండోలు భద్రత కల్పిస్తున్నట్టు పేర్కొన్నాయి. గత వారం మాఫియా డాన్ ఛోటా రాజన్ ఇండోనేషియాలోని బాలిలో అరెస్టైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారత్ కూడా లాడెన్ తరహా స్పెషన్ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందన్న సమాచారంతో పాకిస్థాన్ ఈ చర్యలు తీసుకుందని సమాచారం. మరోవైపు 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న హఫిజ్ సయీద్, లఖ్వీకి కూడా పాకిస్థాన్ భద్రతను పెంచింది.
అంతక ముందు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు సహకరిస్తానని ఇండోనేషియాలోని బాలిలో పట్టుబడిన మాఫియా డాన్ ఛోటా రాజన్ తెలిపాడు. పాకిస్థాన్ గూఢచార సంస్ధ ఐఎస్ఐ దావూద్ ఇబ్రహీంకు రక్షణ కల్పిస్తోందని చెప్పాడు.
బాలి జైలులో ఉన్న ఛోటా రాజన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పైవిషయాన్ని తెలిపాడు. కాగా మంగళవారం ఛోటా రాజన్ను భారత్ తీసుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఛోటా రాజన్ను అధికారులు ముంబై తీసుకొస్తారా? లేక ఢిల్లీకి తీసుకొస్తారా? అనే ఆసక్తి నెలకొంది.
ముంబై కేంద్రంగా అనేక హత్యానేరాలు, ఆక్రమణలు, కిడ్నాప్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసిన ఛోటా రాజన్ను అక్కడికే తరలిస్తారని తొలుత భావించినా, ఢిల్లీకే తీసుకొస్తారని తెలుస్తోంది. రాజన్ను ఢిల్లీ తీసుకువచ్చి, అక్కడ జైలులో సీబీఐ, ముంబై విచారణాధికారులు కలిసే ఏర్పాట్లు చేస్తున్నారు.