'ఎనిమిది సార్లు టాయ్ లెట్ కు వెళ్లి..' : రాజ్ నాథ్ పై పాక్ బద్నాం
న్యూఢిల్లీ : పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టుకుంది. చర్చించాల్సిన విషయాలను పక్కనబెట్టి అనవసరమైన విషయాలకు ప్రాధాన్యం ఇస్తూ.. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను అప్రతిష్ట పాలు చేసే పనిని ముందేసుకుంది.
సార్క్ సమావేశాల సందర్బంగా.. మొత్తం 8 సార్లు రాజ్ నాథ్ టాయ్ లెట్ కు వెళ్లారని, ఆ సందర్బంలో ఎప్పటికప్పుడు తమ పార్టీ నేతలకు సమాచారాన్ని చేరవేశారని అక్కడి మీడియా వార్తలు ప్రచురించడం వివాదస్పదంగా మారింది. ఉగ్రవాదులను అమరవీరుల పేరిట ప్రోత్సహించడం తగదంటూ.. రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్యలకు ఏమాత్రం ప్రాధాన్యం కల్పించని పాక్ మీడియా.. ఇలా టాయ్ లెట్ లెక్కలు చెబుతూ తన నీచబుద్దిని మరోసారి బయటపెట్టుకుంది.
ఇదిలా ఉంటే.. భారత మీడియా మాత్రం పాక్ వ్యవహారాన్ని తప్పుబట్టింది. సార్క్ సమావేశాల సందర్బంగా రాజ్ నాథ్ కేవలం రెండు సార్లే టాయ్ లెట్ కు వెళ్లారని, అదీ సార్క్ సాంప్రదాయల మేరకు.. పాక్ ప్రధానితో భేటీ అయినప్పుడు ఒకసారి, సమావేశానంతరం మరోసారి అని తెలిపింది భారత మీడియా. అంతేకాదు, అసలు ఆ సమయంలో రాజ్ నాథ్ వద్ద సెల్ ఫోన్ కూడా లేదని, ఇండియాలో కూడా ఆయనెప్పుడూ సెల్ ఫోన్ ను పెద్దగా వెంటపెట్టుకుని తిరగరని స్పష్టం చేసింది.
విందుపైనా వివాదమే :
ఇక పాక్ ప్రధాని షరీఫ్ ఇచ్చిన విందుకు రాజ్ నాథ్ హాజరు కాకపోవడాన్ని తప్పుబట్టింది పాక్ మీడియా. అయితే దీనిపై రాజ్ నాథ్ అంతకుముందే వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. విందుకు పిలిచిన పాక్ ప్రధాని తనను పట్టించుకోకుండా ఒక్కరే వెళ్లిపోయారని, ఆ సమయంలో అధికారులెవరు కూడా ఆయన వెంట వెళ్లలేదని, అందుకే తాను కూడా విందుకు దూరంగా ఉండిపోయానని వివరణ ఇచ్చారు రాజ్ నాథ్.
ఇక రాజ్ నాథ్ పర్యటనలో భారత మీడియాకు కూడా పాక్ బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. సార్క్ సమావేశాల వేదిక వద్దకు వెళ్లకుండా భారత మీడియాను అడ్డుకున్న పాక్ అధికారులు, ఆ తర్వాత లాబీలోను సార్క్ దేశాల ప్రతినిధులను కలుసుకునే చర్యకు అడ్డు తగిలారు. ఫోటోలు, వీడియో విషయంలోను పాక్ అధికారులు భారత మీడియాను నియంత్రించే ప్రయత్నం చేశారని భారత జాతీయ మీడియా వెల్లడించింది.