అమెరికా వార్నింగ్ ఎఫెక్ట్: పాకిస్తాన్లో మళ్లీ హఫీజ్ సయీద్ అరెస్ట్!
ముంబై మారణహోమం సూత్రధారి, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ను పాకిస్తాన్ ప్రభుత్వం మళ్లీ అదుపులోకి తీసుకుంది. హఫీజ్ను విడుదల చేసిన మరుక్షణమే అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: ముంబై మారణహోమం సూత్రధారి, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ను పాకిస్తాన్ ప్రభుత్వం మళ్లీ అదుపులోకి తీసుకుంది. వారం క్రితం లాహోర్ కోర్టు ఆదేశాలతో సయీద్ను గృహనిర్బంధం నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే అమెరికా ఒత్తిడితో గురువారం పాకిస్తాన్ ప్రభుత్వం సయీద్ ను మరోసారి అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ను విడుదల చేసిన మరుక్షణమే అమెరికా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాక్ ప్రభుత్వం పునరాలోచించింది.
ఇతర నేరాల్లో హఫీజ్ను అదుపులోకి తీసుకోకపోతే అంతర్జాతీయ వేదికపై దౌత్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. ఈ అంతర్జాతీయ తీవ్రవాదిని తక్షణమే అరెస్ట్ చేసి విచారించకపోతే పాక్తో ద్వైపాక్షిక సంబంధాలను అంతర్జాతీయ సమాజం పున:సమీక్షిస్తుందని కూడా అమెరికా తీవ్ర స్థాయిలో హెచ్చరించింది.
అంతేకాదు, సయీద్పై ఎలాంటి చర్యలు తీసుకోని పక్షంలో పాకిస్తాన్్ తన భూభాగంలో వేళ్లూనుకుని ఉన్న ఉగ్రవాద సంస్థలపై ఉదాసీనంగా వ్యవహరిస్తుందని బలంగా నమ్ముతామని కూడా అమెరికా స్పష్టం చేసింది.
హఫీజ్ సయీద్ను భయంకరమైన తీవ్రవాదిగా పేర్కొంటూ 2008 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఓ ప్రత్యేక తీర్మానం ద్వారా ప్రకటించిన విషయాన్ని అమెరికా ఈ సందర్భంగా పాకిస్తాన్కు గుర్తుచేసింది.
ఓ భయంకర ఉగ్రవాదిని విడుదల చేసిన పాకిస్తాన్ను ఇప్పటికీ నాన్-నాటో మిత్రదేశంగా ఎలా పరిగణనిస్తున్నారో అంతుబట్టడం లేదని అమెరికా విదేశీ వ్యవహారాల కౌన్సిల్ అధ్యక్షుడు రిచర్డ్ హాస్ పేర్కొన్నారు.
రిచర్డ్ హాస్ ఇలా వ్యాఖ్యానించిడానికి ముందు రోజే పాకిస్తాన్ను ఇకమీదట మిత్రపక్షంగా పరిగణించరాదని అమెరికాకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక పోరాట నిపుణుడు పేర్కొనడం గమనార్హం.
26/ 11 ముంబై దాడులు జరిగి తొమ్మిదేళ్లు పూర్తయినా ప్రధాన సూత్రధారి స్వేచ్ఛగా తిరుతున్నాడని, పాక్ను నాన్-నాటో మిత్రపక్షం హోదా నుంచి తప్పించడానికి ఇదే సరైన సమయమని అమెరికా భద్రతాధికారి, దక్షిణాసియా తీవ్రవాద వ్యతిరేక పోరాట నిపుణుడు బ్రూస్ రైడెల్ వ్యాఖ్యానించారు.
హఫీజ్ సయీద్ విడుదలతో తమ దేశానికి దౌత్యపరమైన, ఆర్థికపరమైన సమస్యలు ఎదురవుతాయని పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అమెరికా ఒత్తిడితో పాక్ అధికారులు సయీద్ను తిరిగి అరెస్ట్ చేశారు.