పాక్ దుశ్చర్యలపై రాజ్నాథ్ సింగ్ ఫైర్: యువతకు పిలుపు
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి పాకిస్థాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని అస్థిరపర్చేందుకు పాకిస్థాన్ కుట్రలు చేస్తోందని ఆయన అన్నారు. పాక్ ఉగ్రవాదులు సరిహద్దులు దాటి జమ్మూకాశ్మీర్లో యువతను ఉపయోగించుకుంటూ వారితోటే దేశ భద్రతా బలగాలపై రాళ్ల దాడి చేయిస్తున్నారని అన్నారు.
సోషల్ మీడియా సాయంతో ఒక్క జమ్మూకాశ్మీర్లోనే కాదు, మొత్తం భారతదేశంలోనే అస్థిరతను సృష్టించేందుకు పాకిస్థాన్ వెన్నుపోటు చర్యలకు దిగుతోందని అన్నారు. పాక్ చేస్తున్న దశ్చర్యలు తెలుసునని, ఎంతమేరకు అవసరం అవుతుందో ఆ మేరకు మన బలగాలు కూడా గట్టి సమాధానం చెబుతున్నాయన్నారు.
ఇప్పుడు కాశ్మీర్లో కొత్త పద్ధతి మొదలైందని, ఉగ్రవాదులను వెతికేందుకు బలగాలు గ్రామాల్లోని ఇళ్లకు వెళ్లగానే అక్కడి యువత రాళ్లు విసురుతున్నారని అన్నారు. వీరంతా ఉగ్రవాదుల వల్ల తప్పుదోవ పడుతున్నవారేనని తెలిపారు.
ఫేస్బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియాల ద్వారా పాక్ మన దేశ యువతను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. పాక్ కుట్రలకు జమ్మూకాశ్మీర్ యువత, ప్రజలు లొంగవద్దని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.