పాక్ మరో కుట్ర: కుల భూషణ్ జాదవ్ వీడియో పేరుపై డ్రామా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరో కుట్ర నాటకానికి తెర తీసినట్లు కనిపిస్తోంది.భారత మాజీ నేవీ అధికారి కుల భూషణ్ జాదవ్ తల్లిపట్ల, భార్య పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మరో డ్రామాకు తెర తీసింది.
జాదవ్ను చూడడానికి వెళ్లిన తల్లీ, భార్య కట్టుబొట్టు తీసేసి వారిని పాకిస్తాన్ అవమానించిందనే విషయం వెలుగు చూసింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు సరికొత్త డ్రామాకు తెర తీసింది. భారత దౌత్యాధికారిని లక్ష్యం చేసుకుంది
జాదవ్తో ఇలా చెప్పించింది...
పాకిస్తాన్లో భారత దౌత్యాధికారి తన తల్లిని పదే పదే దూషించారని, కేకలు వేశారని, దాంతో తన భార్యతల్లి భయపడినట్లు తనకు అనిపించిందని పాకిస్తాన్ జాదవ్తో చెప్పించింది. ఈ మేరకు ఇవాళ జాదవ్ మాట్లాడినట్లు ఉన్న ఓ వీడియోను పాకిస్తాన్ విడుదల చేసింది.
వారి వెెంట జెపి సింగ్...
జాదవ్ తల్లి, ఆయన భార్య పాకిస్తాన్ వెళ్లినప్పుడు వారివెంట పాకిస్తాన్లోని భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్ ఉన్నారు. భారత గూఢచారిగా ఆరోపిస్తూ పాకిస్తాన్ జాదవ్కు ఉరిశిక్ష ఖరారు చేసింది. భారత నిఘా సంస్థ ‘రా' కోసం జాదవ్ పనిచేస్తున్నారని, అందుకే ఆయనను జాదవ్ను బలోచిస్తాన్లో ఆరెస్టు చేశామంటూ పాకిస్తాన్ చెబుతోంది.
ప్రైవేట్ వ్యాపారం చేసుకుంటున్న..
వ్యాపారం చేసుకుంటున్న జాదవ్ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు భారత్ ఆరోపిస్తోంది. జాదవ్ కలుసుకునేందుకు భారత అధికారులకు పాకిస్తాన్ ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు. ఈ స్థితిలో పాకిస్తాన్ చెబుతునట్టుగా తాను ఇంటిలిజెన్స్లో పనిచేస్తున్నట్టు భారత్ ఎందుకు ఒప్పుకోవడం లేదంటూ జాదవ్ వీడియోలో ప్రశ్నిస్తున్నట్టు వినిపించింది.
ఆనందంగా ఉన్నానని చెప్పించి..
తాను పాకిస్తాన్లో ఆనందంగా ఉన్నానని, తనకు ఏ విధమైన ప్రమాదం లేదని జాదవ్ వీడియోలో చెబుతూ కనిపించారు. తనను చూసిన తర్వాత ఆనందంగా ఉన్నట్లు తల్లి చెప్పిందని, పాకిస్తాన్లో తనను ఎవరూ వేధించడం లేదని జాదవ్ వీడియోలో అన్నారు. పాకిస్తాన్కి చెందిన జియో టీవీ ఈ వీడియోను యూట్యూబ్లో పోస్టు చేసింది.