మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్: మేజర్ సహా ముగ్గురు మృతి
పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత జవాన్లపై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో భారత మేజర్తోపాటు ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది.
జమ్ముకశ్మీర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత జవాన్లపై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన ఒక మేజర్తోపాటు ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది.
కశ్మీర్లోని బెటాలియన్ ఏరియాకు దగ్గర్లో ఉన్న కెరీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాక్ సైన్యం ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సైనిక అధికారి ఒకరు వెల్లడించారు.
గురు, శుక్రవారాల్లో కూడా పాక్ ఇలాగే భారత సైన్యంపై కాల్పులు జరిపింది. నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీలోని నౌషెరా సెక్టార్, లాన్ సెక్టార్లో పాక్ సైన్యం ఇలాగే భారత జవాన్లపై హఠాత్తుగా కాల్పులు జరిపింది.
ఇక శనివారం జరిపిన ఈ ఆకస్మిక దాడిలో మేజర్తో పాటు ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.