ముంబైపై దాడి కోసం 8 ఇంజిన్లు అమ్మిన పాక్ కంపెనీ
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: ముంబైలో దాడులకు సహకరించిన వారికి పాకిస్థాన్కు చెందిన ఓ కంపెనీ 8 యమహా ఇంజిన్లు అమ్మినట్లు తేలింది. ముంబై చేరుకునేందుకు చిన్న పడవల్లో ఉపయోగించేందుకు కసబ్ సహా ఉగ్రవాదులకు ఇంజిన్లు అందజేసినట్లు వెల్లడైంది.
సదరు కంపెనీకి చెందిన జనరల్ మేనేజర్ ఒకరు బుధవారం ఉగ్రవాద నిరోధక న్యాయస్థానానికి ఈ విషయాలను తెలియజేశారు. రావల్పిండిలోని అడియాల జైలులోని న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో దీనిపై అతడు సాక్ష్యం చెప్పారు.

పరారీలో ఉన్న నిందితుడు అజాంఖాన్కు ఇంజిన్లు అమ్మినట్లు తెలిపారు. జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న ఇంజిన్లకు తమ విభాగం అనుమతి పత్రం ఇచ్చినట్లు కస్టమ్స్ అధికారి ఒకరు సాక్ష్యం చెప్పారు.
ఆ ఇంజిన్ల సహాయంతో ముంబై చేరుకున్న కసబ్ సహా మిగితా ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. కాగా, ఈ కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. మరో ఆరుగురు నిందితులు అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.












Click it and Unblock the Notifications