ఆ ముగ్గురు ఉగ్రవాదుల హతం: 220కోట్ల నష్టం?
శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్లోని పాంపోర్లో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య సుమారు 48గంటలపాటు జరిగిన భీకర పోరాటం ముగిసింది. పాకిస్థాన్కు చెందినవారిగా అనుమానిస్తున్న ముగ్గురు లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాదులను మట్టుపెట్టడంతో సోమవారం సాయంత్రం ఆపరేషన్ ముగిసినట్లు అధికారులు స్పష్టంచేశారు.
శ్రీనగర్ శివార్లలో 48 గంటలపాటు ఉద్ధృతంగా కొనసాగిన ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు భద్రతా సిబ్బంది, ఓ పౌరుడు మృత్యువాతపడ్డారు. కాల్పులు సోమవారం మూడో రోజుకు చేరుకోవడంతో.. సైన్యంలోని ప్రత్యేక బృందాలు మరింత మందిని రంగంలోకి దింపాయి.
మోర్టార్ బాంబులతో దాడులు ప్రారంభించాయి. దీంతో ఐదంతస్తుల భవనంలోని పైభాగానికి నిప్పంటుకుంది. వెంటనే లోపలున్న ముష్కలు ఒకవైపుగా వచ్చేశారు. అక్కడే భద్రతా దళాలు వారిని మట్టుపెట్టాయి.
పాకిస్థాన్కు చెందినవారే!
మృతి చెందిన ఉగ్రవాదుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని విక్టర్ ఫోర్స్ జీసీవో మేజర్ జనరల్ అరవింద్ దత్తా వెల్లడించారు. కానీ, వారు విదేశీ ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారని ఆయన చెప్పారు. వీరు సరిహద్దులను దాటి దేశంలోకి ప్రవేశించి ఉండొచ్చని చెబుతూ.. పరోక్షంగా పాకిస్థాన్కు చెందినవారేనని సంకేతమిచ్చారు.
ముష్కరులు ముందుగానే ఈ భవనంలోకి చొరబడాలని లక్ష్యం నిర్దేశించుకున్నారని తెలిపారు. దీంతో భారీ ఆయుధాలతో వచ్చిన వీరు మొదటగా శనివారం మధ్యాహ్నం కేంద్ర రిజర్వు పోలీసు దళం(సీఆర్పీఎఫ్) వాహన శ్రేణిపై దాడికి తెగబడ్డారని చెప్పారు. అనంతరం శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ భవనంలోకి చొరబడ్డారని చెప్పారు. వెంటనే భవనంలోని 120 మంది పౌరులను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని తెలిపారు.
కాగా, ఈ దాడులు లష్కరే తొయిబా ఉగ్రవాదులు చేపట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రకాశ్ మిశ్ర తెలిపారు. జమ్మూకాశ్మీర్లోని ఉధమ్పూర్, పంజాబ్లోని గురుదాస్పూర్లలో భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఈ మధ్యకాలంలో జరిగిన దాడులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం కూడా మొదట సీఆర్పీఎఫ్ లక్ష్యంగా ముష్కరులు దాడికి తెగబడినట్లు ఆయన వివరించారు.
పోంపోర్ ఉగ్రదాడి నష్టం 220 కోట్లు?
జమ్మూకాశ్మీర్ లోని పాంపోర్లో సోమవారం హతమైన ఉగ్రవాదులు రెండ్రోజుల క్రితం జమ్మూకాశ్మీర్ ఎంటర్ ప్రెన్యూర్స్ డెవలెప్ మెంట్ ఇన్స్ స్టిట్యూట్ (జేకేఈడీఐ)లోని నాలుగవ అంతస్తులో మకాంవేసిన సంగతి తెలిసిందే. జమ్మూకాశ్మీర్ ప్రధాన రహదారి పక్కనే మూడు ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ భవనం నిర్మించారు.
దీని ద్వారా 2004 నుంచి ఇప్పటి వరకు 13వేల మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు శిక్షణ ఇచ్చారు. వీరితోపాటు మరో 5వేల మందికి సుమారు 220 కోట్ల రూపాయలు రుణాలుగా ఇచ్చారు. ఈ మొత్తం వివరాలు ఈ భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న డేటాబేస్ కేంద్రంలో నిక్షిప్తమై ఉన్నాయి.
కాగా, జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ వ్యాన్ పై దాడి చేసిన తీవ్రవాదులు నేరుగా ఈ భవనంలో ప్రవేశించి, నాలుగో అంతస్తులో మకాం పెట్టారు. 48 గంటలపాటు భద్రతా బలగాల కాల్పులకు ఎదురొడ్డిన తీవ్రవాదులు ఈ డేటా బేస్ను నాశనం చేసేశారని సమాచారం. దీంతో డేటాబేస్ బ్యాకప్ లేకపోవడంతో ఈ దాడి వల్ల 220 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.
కాగా, దీనిపై గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించామని భద్రతా బలగాలు, పోలీసు బలగాలు చెబుతున్నాయి. అయినా రాష్ట్రప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని, ప్రైవేటు సెక్యూరిటీతోనే రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారని వారు మండిపడుతున్నారు.