'మహిళలు మొబైల్ ఫోన్లు వాడొద్దు, జీన్స్ ధరించొద్దు'
లక్నో: మహిళలు, యువతులు జీన్స్ ప్యాంటులు ధరించరాదని, మొబైల్ ఫోన్లు వాడకూడదని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్ సమీపంలో సమావేశమైన ఓ కుల పంచాయతీ ఆదేశాలు జారీ చేసింది. సామాజిక అనుసంధాన వెబ్ సైట్లు ఫేస్బుక్, వాట్సప్ వంటి వాటిని కూడా ఎవరూ వాడవద్దని ఆదేశించారు.
తమ ఆదేశాలు ముజఫర్నగర్ పరిధిలోని నలభై ఆరు గ్రామాలకు వర్తిస్తుందని పంచాయతీ పెద్దలు చెప్పారు. కాగా, ఈ తరహా ఆదేశాలు ఖాప్ పంచాయతీలు గతంలోను ఇచ్చిన విషయం పలుమార్లు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో ఈ తరహా ఆదేశాలు ఖాప్ పంచాయతీలు ఇస్తుంటాయి.
ఈ ఏడాది ఆగస్టులో పంచాయతీకి చెందిన ఓ కమ్యూనిటీ తమ వర్గానికి చెందిన యువతులు జీన్స్ ధరించవద్దని, మొబైల్ ఫోన్లను వాడవద్దని తీర్మానించారు. జీన్స్ ధరించడం, మొబైల్ ఫోన్లు వాడటం వల్ల చెడు ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.
ఈవ్ టీజింగ్ తదితరాలకు ఇదే కారణమని వారు అభిప్రాయపడ్డారు. జాడ్వాద్ గ్రామంలోని గుజ్జార్ కమ్యూనిటీ వారు ఆగస్టు నెలలో ఈ ఆదేశాలు జారీ చేశారు. పెళ్లి కాని యువతులు ఫోన్లు, జీన్స్ ధరించవద్దని తీర్మానించినట్లు వారు అప్పుడు చెప్పారు. దీని పైన పలువురు మండిపడుతున్నారు.