ఇవీ ప్రశ్నలు: జయలలిత మృతి వెనక పెద్ద కుట్ర
జయలలిత మరణం వెనక పెద్ద కుట్ర ఉందని పాండ్యన్ అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు ప్రశ్నలను సంధించారు. ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయి...
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనక పెద్ద కుట్ర ఉందనే అనుమానాలను అన్నాడియంకె తిరుగుబాటు నేత పిహెచ్ పాండ్యన్ వ్యక్తం చేశారు. అపోలో ఆస్పత్రిలో ఉండగా, మెరుగైన చికిత్స కోసం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సింగపూర్ వెళ్లాలనుకున్నారని, కానీ కొందరు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
ఆమె కోసం వచ్చిన ఎయిర్ అంబులెన్స్ని కూడా వెనక్కి తిప్పి పంపించారని చెప్పారు. జయ మరణం వెనుక కుట్ర ఉన్నదని ఆరోపిస్తూ ప్రధానినరేంద్ర మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలని కోారు. కిందపడడం వల్ల జయ గాయపడ్డారని అపోలో ఆస్పత్రి ఇచ్చిన డిశ్చార్జ్ సమ్మరీలో ఉందని గుర్తు చేస్తూ ఎవరో తోయడం వల్ల ఆమె పడిపోయారా లేక ప్రమాదవశాత్తూ గాయపడ్డారా అనేది తేలాల్సి ఉందని అన్నారు.
జయ అనారోగ్యానికి గురైనప్పుడు ఓ డీఎస్పీ అంబులెన్సును రప్పించారని శశికళ వర్గం చెబుతున్నారని అంటూ ఆ డిఎస్పీ ఎవరు? ఆ అంబులెన్సు ఎక్కడ? అంబులెన్సు పోయెస్ గార్డెన్లో ఎన్ని గంటలకు బయలుదేరి, ఎన్ని గంటలకు అపోలోకు చేరుకుంది? అపోలో చుట్టూ ఉన్న 27 సీసీ కెమెరాలను హడావుడిగా ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నించారు. ఆయన వాదనలు ఇంకా విధంగా ఉన్నాయి.

జయలలితకు శాంతారాం అనే డాక్టర్ చికిత్స అందించేవారని, నిరుడు మేలో ఆయన్ని పోయెస్ గార్డెన్ నుంచి బయటకు వెళ్లగొట్టారని పాండ్యన్ అన్నారు. జయను అపోలోలో చేర్చేటప్పుడు ఎవరు సంతకం పెట్టారని నిలదీశారు. జయకు చికిత్స చేసిన ఎయిమ్స్ వైద్యులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తూ దీనికి కేంద్రప్రభుత్వమే సమాధానం చెప్పాలని పాండ్యన్ డిమాండ్ చేశారు.
నిరుడు డిసెంబరు 4వ తేదీ సాయంత్రమే జయ మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయని పాండ్యన్ గుర్తు చేస్తూ మరునాటి రాత్రి వరకు ఎందుకు డ్రామాలాడారని ప్రశ్నించారు. ఆ రెండు రోజుల్లో అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందని, ప్రధాని, రాష్ట్రపతి జోక్యం చేసుకోవడం అవసరమని అన్నారు.
పాండ్యన్ చేసిన ఆరోపణలను రాష్ట్ర మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ కొట్టిపడేశారు. జయ కిందపడటం వల్లే గాయపడినట్టు డిశ్చార్జ్ సమ్మరీలో లేదని, విదేశీ వైద్యులు, అపోలో యాజమాన్యం జయ మృతిపై ఇప్పటికే వివరణ ఇచ్చారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications