రాజ్యసభలోను దుమారం.. 'జయ' మృతిపై విచారణకు ఎంపీల డిమాండ్
జయలలిత మృతిపై ఇంత భారీ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నా.. విచారణకు ఎందుకు ఆదేశించడం లేదంటూ వారు ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై ఇప్పటికీ అనుమానాలు రేగుతూనే ఉన్నాయి. ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టులు, ప్రభుత్వ వివరణ పట్ల దీప, పన్నీర్ సెల్వం ఎంతమాత్రం సంతృప్తిగా చెందలేదు.
తాజాగా పన్నీర్ సెల్వం మద్దతుదారులైన ఎంపీలు రాజ్యసభలో జయలలిత మృతి అంశాన్ని లేవనెత్తారు. దానిపై విచారణ జరిపించాల్సిందేనని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. జయలలిత మృతిపై ఇంత భారీ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నా.. విచారణకు ఎందుకు ఆదేశించడం లేదంటూ వారు ప్రశ్నించారు.
స్పీకర్ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఎంతకీ వినకపోవడంతో.. వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం నేటి మధ్యాహ్నాం 2.30గం.కి సభ వాయిదా పడింది.
కాగా, జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఇప్పటికే ఒకరోజు దీక్ష చేపట్టగా.. అమ్మకు చికిత్సకు సంబంధించిన రిపోర్టులపై ఎవరు సంతకాలు చేశారని జయ మేనకోడలు దీప జయకుమార్ ప్రశ్నిస్తోన్న సంగతి తెలిసిందే. జయకు తాను, తన సోదరుడు మాత్రమే బంధువులమని, వేరేవాళ్లు ఎలా సంతకం చేస్తారని ఆమె అంటున్నారు.