తోడుదొంగలు, ఎలా నమ్మేది? దినకరన్, పళనిస్వామిపై పన్నీరు సంచలనం
ప్రస్తుతం జైలులో ఉన్న శశికళ, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ను అన్నాడీఎంకే పార్టీకి దూరం చేసి.. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం ఒక్కటవుతారని అనుకుంటున్న సమయంలో మరోసారి వీరిద్దరి
చెన్నై: ప్రస్తుతం జైలులో ఉన్న శశికళ, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ను అన్నాడీఎంకే పార్టీకి దూరం చేసి.. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం ఒక్కటవుతారని అనుకుంటున్న సమయంలో మరోసారి వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో మరోసారి విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు మారోసారి మొదటికే వస్తున్నాయి.

తోడు దొంగలు
శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిలు తోడు దొంగలని అన్నాడీఎంకే (పురట్చితలైవి అమ్మ) నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం విరుచుకుపడ్డారు. అన్నాడీఎంకేను కొందరి నుంచి విడిపించేందుకు ప్రారంభించిన ధర్మయుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అమ్మ మార్గదర్శకత్వం మేరకు.
అన్నాడీఎంకే (పురట్చితలైవి అమ్మ) కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ బహిరంగసభ చెన్నై కొత్తచాకలిపేటలోని ఎ.ఇ.కోవిల్ వీధిలో సోమవారం రాత్రి జరిగింది. ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదన్ అధ్యక్షతన జరిగిన సభలో ఓ.పన్నీర్సెల్వం పాల్గొని ఆర్థికంగా చితికిపోయిన కార్మికులకు సంక్షేమ సహాయాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని 27 ఏళ్లపాటు పరిపాలించిన ఘనత అన్నాడీఎంకే నేతలు ఎంజీఆర్, జయలలితలకు దక్కుతుందన్నారు. జయలలిత మరణానంతరం ఆమె ప్రజాపాలన తత్వం, మార్గదర్శకత్వం మేరకు పార్టీ కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఆ కుటుంబానికి చిక్కొద్దు
ఒక కుటుంబం కబంధ హస్తంలో పార్టీ, పాలన చిక్కుకోకూడదని అందరూ భావించారని, అయితే అదే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ కుటుంబ కబంధ హస్తం నుంచి పార్టీని, పాలనను విడిపించడానికి ప్రారంభించిన తమ ధర్మయుద్ధం కొనసాగుతుందని పన్నీరుసెల్వం పునరుద్ఘాటించారు. ఇందులో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఆర్కేనగర్ మాదే..
ఆర్కేనగర్ నియోజకవర్గంలో తమ అభ్యర్థి మధుసూదన్కు ప్రజలు పూర్తిస్థాయి మద్దతిచ్చారని, దీంతో భయపడిన టీటీవీ దినకరన్ వర్గం ఓటుకు రూ.4 వేలు, డీఎంకే రూ.2 వేలు పంచాయని ఆరోపించారు. ఆర్కేనగర్ ఎన్నిక ఎప్పుడు జరిగినా విజయం తమదేనని, మధుసూదన్ గెలిచి తీరుతారని తెలిపారు.

విలీనం పేరిట నాటకాలు
జయలలిత మృతిలో ఉన్న మర్మాన్ని బయటపెట్టేందుకు కేంద్రం పరిధిలోని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రజాభీష్టం మేరకు టీటీవీ దినకరన్ను దూరంగా ఉంచినట్లు చెబుతున్నారని, అయితే ఎన్నికల సంఘం వద్ద దాఖలు చేసిన ప్రమాణపత్రంలో ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పేర్లను తొలగించలేదని, అదనంగా ఎడప్పాడి పళనిస్వామి పేరు మాత్రమే చేర్చారని పేర్కొన్నారు. విలీనం పేరిట నాటకం ఆడారని, ఇలాంటి వారిని ఎలా విశ్వసించాలని ప్రశ్నించారు. టీటీవీ దినకరన్, ఎడప్పాడి పళనిస్వామి తోడు దొంగలని ధ్వజమెత్తారు. అందుకే తాము ప్రజల్లోకే వెళుతున్నామని, వీరి బాగోతాన్ని బయటపెడతామని అన్నారు. పన్నీరు సెల్వం రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టునున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications