సీఎం లేకుండా తమిళనాడు కేబినెట్ సమావేశం
చెన్నై: కావేరీ జలాలపై సుప్రీం కోర్టులో కర్ణాటక వేసిన పిటిషన్, తమిళనాడులో ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపై చర్చించడానికి తమిళనాడు కేబినెట్ భేటీ అయ్యింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్బంగా ఆర్థిక శాఖా మంత్రి ఓ. పన్నిర్ సెల్వం అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి జయలలిత శాఖలు అన్నీ పన్నీర్ సెల్వం చేపట్టిన విషయం తెలిసిందే. సీఎం లేకుండా పన్నిర్ సెల్వం అధ్యక్షతన మొదటి సారి తమిళనాడు కేబినెట్ సమావేశం జరిగింది.
కావేరీ జలాల విడుదల కోరుతూ ప్రతిపక్షం అయిన డీఎంకేతో సహ పీఎంకే, డీఎండీకే, సీపీఐ, కాంగ్రెస్ తదితర పార్టీలు తమిళనాడులో 48 గంటలు రైల్ రోకో నిర్వహించారు. తమిళనాడుకు తాము నీళ్లు విడుదల చెయ్యలేమని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ప్రతిపక్షాలను నిలువరించేలా, తమిళనాడు ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎం చెయ్యాలి అని కేబినెట్ సమావేశంలో చర్చించారు. కావేరీ జలాల విషయంలో తమిళనాడు ప్రయోజనాల దెబ్బతినకుండా పన్నిర్ సెల్వం అధ్యక్షత జరుగుతున్న కేబినెట్ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుటుందో అని ప్రజలతో పాటు ప్రతిపక్షాలు వేచి చూస్తున్నాయి.