శశికళకూ నమ్మిన బంటు: పన్నీరు సెల్వమే ఎందుకంటే.. పెద్ద కథే!
చెన్నై: జయలలిత మృతి నేపథ్యంలో ఆమె వారసుడిగా పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా సోమవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. పన్నీరు సెల్వంను ఎంపిక చేయడం వెనుక చాలా పెద్ద కథే ఉందని అంటున్నారు. ప్రధానంగా ఆయన జయకు నమ్మిన బంటు.
జయలలిత, శశికళలకు పన్నీర్ను మించిన నమ్మకస్తులు లేరు. పదవి నుంచి జయలలిత దిగిపోయినా తిరిగి ఆమె వచ్చే వరకు పన్నీర్ సెల్వం ఆమె కుర్చీలో కూర్చోలేదు. విమర్శలు వస్తే పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో జయ కుర్చీకి దండం పెట్టి సందర్శకుల స్థలంలో కూర్చునే వారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో జయలలిత ఫోటోలు తప్ప తనవి ఉండకూడదని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసారు. ఆయనకు అమ్మ జయలలిత, చిన్నమ్మ శశికళల ఆదేశాలే వేదవాక్కు. జయలలిత, శశికళకు ఆయన అంటే విశ్వాసానికి మరిన్ని కారణాలున్నాయి.

2001లో టాన్సీ భూముల కుంభకోణంలో జయను కోర్టు దోషిగా నిర్ణయించినప్పుడు ఆమె ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. అదే ఏడాది సెప్టెంబరు 21న తన స్థానంలో పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా ఎంపికచేసి జయ అందరినీ ఆశ్చర్యపరిచారు.
వేదిక పైనే సాష్టాంగ పడ్డారు.
ప్రమాణస్వీకార వేదికపైనే జయలలితకు ఆయన ముఖ్యమంత్రి హోదాలో సాష్టాంగపడ్డారు. కీలక డాక్యుమెంట్ల పైన సంతకాలు చేయాలన్నా జయ ఇంటి నుంచి ఆదేశాలు వచ్చే దాకా నిరీక్షించేవారు. ఇటీవల కూడా ఆస్తుల కేసులో జయ జైలుకు వెళ్లినప్పుడు రెండోసారి పన్నీరు సెల్వం సీఎం అయ్యారు.
కాపలాకాయడమే పన్నీరు సెల్వం పని!
అయితే, ఆయన దృష్టిలో తాను ఆమె కుర్చీకి కాపలాదారు మాత్రమే. సంక్షోభాలతో పదవి దిగాల్సి వచ్చిన ప్రతిసారి ఆమె కుర్చీని కాపలా కాయడం, మళ్లీ జయలలిత రాగానే అప్పగిస్తూ విశ్వాసాన్ని చూరగొన్నారు.
2001 సెప్టెంబరులో ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వంను జయలలిత ప్రకటించే వరకూ ఎవరికీ పెద్దగా తెలియదు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఈయన చిన్న టీ కొట్టు నడిపారు. గ్లాసులు కడిగారు. టీ కొట్టు ఇప్పటికీ నడుస్తోంది. డైరీ ఫాం ఉండేది. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు.
ఎంజీఆర్కు పెద్ద అభిమాని. 1972లో డీఎంకే నుంచి ఎంజీఆర్తో పాటు బయటకు వెళ్లారు. ఎంజీఆర్ మరణించాక ఆయన సతీమణి జానకీ రామచంద్రన్ శిబిరంలో కొన్నాళ్లు ఉన్నారు. ఆ తర్వాత జయలలిత పంచన చేశారు. జయ ప్రాణసఖి శశికళ సామాజికవర్గం దేవర్కు చెందినవారు. ప్రస్తుతం పన్నీరు సెల్వం సీఎం కావడం వెనుక శశికళ హస్తం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications