ఏడాది క్రితం సీఎం, నేడు డీసీఎం, తమిళనాడు రాజకీయాలు మలుపు తిరిగింది ఇదే రోజు!
చెన్నై: గత ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ ఇదే రోజు తమిళనాడు రాజకీయాల రంగు ఒక్కసారిగా మారిపోయింది. ఆ రోజు దేశం మొత్తం తమిళనాడు వైపు చూసింది. జయలలిత మరణించిన రెండు నెలలకే అన్నాడీఎంకే పార్టీ ముక్కలు అయ్యింది. పన్నీర్ సెల్వం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అన్నాడీఎంకే పార్టీ, శశికళ మీద తిరుగుబాటు చేసి నేటికి ఏడాది పూర్తి అయ్యింది. ఆ రోజు పన్నీర్ సీఎం, నేడు డీసీఎం.

సీఎం పదవికి రాజీనామా
2017 ఫిబ్రవరి 6వ తేదీ పన్నీర్ సెల్వం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ సైతం పన్నీర్ సెల్వం రాజీనామాను అంగీకరించారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే వరకు అపధ్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ పన్నీర్ సెల్వంకు సూచించారు.

అమ్మ సమాధి
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం నేరుగా మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గరకు వెళ్లి మౌనదీక్ష చేపట్టారు. రాత్రి 10.30 గంటల వరకు జయలలిత సమాధి దగ్గర మౌనదీక్ష చేసిన పన్నీర్ సెల్వం అనంతరం బాంబు పేల్చారు.

శశికళ బెదిరించారు
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని శశికళ తన మీద ఒత్తిడి తీసుకు వచ్చారని, మన్నార్ గుడి మాఫియా ముఠా తనను బెదిరించిందని పన్నీర్ సెల్వం మీడియాకు చెప్పి బాంబుపేల్చారు. తరువాత సీఎంగా తన దగ్గర ప్రమాణస్వీకారం చేయించాలని శశికళ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ ను కలిశారు.

జైలుకు చిన్నమ్మ
అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక చీఫ్ గా ఉన్న శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లడం, పళనిస్వామి సీఎం కావడం, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి హోదాలో టీటీవీ దినకరన్ పెత్తనం చెలాయించడం చకచకా జరిగిపోయాయి.

ఢిల్లీ పెద్దల ప్లాన్
అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఆ పార్టీ గుర్తు కోసం ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించి న్యాయపోరాటం చేశాయి. చివరికి ఢిల్లీలోని కొందరు పెద్దల జోక్యంతో పన్నీర్ సెల్వం, పళనిస్వామి కొన్ని షరతులతో ఒక్కటి కావడానికి అంగీకరించారు.

శశికళ, దినకరన్
పన్నీర్ సెల్వం డిమాండ్ మేరకు అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్, వారి కుటుంబ సభ్యులను శాస్వతంగా బహిష్కరించారు. తరువాత పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం శశికళ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి శాస్వతంగా బయటకు పంపించేశారు.

ఏడాదిలో ఎంత మార్పు
గత ఏడాది నుంచి తమిళనాడు రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. ఆ రోజు సీఎం పదవికి రాజీనామ చేసిన పన్నీర్ సెల్వం నేడు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. శశికళ మీద ఏడాది క్రితం తిరుగుబాటు చేసి తమిళనాడు రాజకీయాలను ఓ మలుపు తిప్పిన పన్నీర్ సెల్వం వర్గీయులు ఈ రోజు పండగ చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications