గవర్నర్ ‘ఒకే మాట’: కన్నీళ్లతో ఫైళ్లు విసిరికొట్టిన శశికళ, పన్నీరు జోష్
ముఖ్యమంత్రి పదవి పంచాయతీ గురువారం రాజ్భవన్కు చేరింది. తుది నిర్ణయం ప్రకటించాల్సిన గవర్నర్ విద్యాసాగర్ రావు.. పన్నీరు, శశికళ వాదనలు విన్నారు. ఆ తర్వాత వారిద్దరికీ కూడా ‘పరిశీలించి చెబుతాను’.
చెన్నై: తమిళనాట రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. గత రెండ్రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురాగా, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను మాత్రం ఆందోళనకు గురిచేసేలా మారాయి.
శశికళకు షాక్! పన్నీరుకే 95శాతం మద్దతు: తేల్చేసిన ఆన్లైన్ సర్వే
ఇది ఇలా ఉంటే.. ముఖ్యమంత్రి పదవి పంచాయతీ గురువారం రాజ్భవన్కు చేరింది. తుది నిర్ణయం ప్రకటించాల్సిన గవర్నర్ విద్యాసాగర్ రావు.. పన్నీరు, శశికళ వాదనలు విన్నారు. ఆ తర్వాత వారిద్దరికీ కూడా 'పరిశీలించి చెబుతాను' అంటూ ఒకేఒక్క వాక్యంతో సరిపెట్టి ఉత్కంఠను తారస్థాయికి తీసుకెళ్లారు.
తమిళనాడు నాశనమే: శశికళపై డైరెక్టర్ రాజేంద్రన్ సంచలన వ్యాఖ్యలు
అయితే గవర్నర్తో తొలుత భేటీ అయిన పన్నీర్ సెల్వం రాజ్భవన్ నుంచి హుషారుగా బయటికి వచ్చారు. ఆ తర్వాత శశికళ మాత్రం ముభావంగా వెలుపలికి రావడం గమనార్హం. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం గురువారం సాయంత్రం 4.45 గంటలకు రాజ్భవన్ వెళ్లారు. గవర్నర్ విద్యాసాగర్ రావుతో చర్చలు జరిపారు.
పన్నీరు వాదన
‘అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నాతో సీఎం పదవికి బలవంతంగా రాజీనామా చేయించారు. రాష్ట్ర ప్రజల మేలు కోసం నేను మనసు మార్చుకున్నాను. నా రాజీనామాను ఉపసంహరించుకునేందుకు అనుమతించండి. అవసరమైతే శాసనసభలో బల నిరూపణకు కూడా సిద్ధమే' అని గవర్నర్కు పన్నీర్ నివేదించినట్లు తెలిసింది. పన్నీర్సెల్వం బృందం చెప్పిన మాటలను గవర్నర్ శ్రద్ధగా ఆలకించారు.
అంతా మంచే జరుగుతుంది..
ఆ తర్వాత... ‘నేను పరిశీలిస్తాను' అని చెప్పి గవర్నర్.. పన్నీరును పంపించారు. రాజ్భవన నుంచి బయటికొచ్చేటప్పుడు పన్నీర్సెల్వం ముఖం సంతోషంతో వెలిగిపోతూ కనిపించింది. ‘అంతా మంచే జరుగుతుంది. ధర్మానిదే తుది విజయం' అని ఆయన ప్రకటించారు. పన్నీర్ సెల్వం రాజ్భవన్లో సుమారు అరగంటపాటు ఉన్నారు. అయితే, గవర్నర్తో పది నిమిషాలపాటు మాత్రమే చర్చించినట్లు సమాచారం.
శశికళ వాదన
రాత్రి 7.30 గంటలకు శశికళ గవర్నర్తో భేటీ అయ్యారు. అంతకుముందు ఆమె జయలలిత సమాధి వద్దకు వెళ్లి... పుష్పాంజలి ఘటించారు. గవర్నర్కు సమర్పించనున్న వినతిపత్రం, ఎమ్మెల్యేల జాబితా ఉన్న కవరును అమ్మ సమాధిపై ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత గవర్నర్ను కలిసి తన వాదన వినిపించారు.
పన్నీరుతో సహా.. ఎమ్మెల్యేలంతా నా వెంటే..
అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారంటూ.. వారి సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు ఇచ్చారు. మొత్తం 134 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారంటూ ఆ పేర్ల జాబితాను సమర్పించారు. కాగా, ఆ జాబితాలో తన ప్రత్యర్థి పన్నీర్ సెల్వం పేరూ చేర్చడం గమనార్హం. ‘ఎమ్మెల్యేలంతా నా వెంటనే ఉన్నారు. అవసరమైతే రాజ్భవన్కు తీసుకొచ్చి మీముందు హాజరుపరుస్తాను. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించండి' అని గవర్నర్ను కోరినట్లు తెలిసింది. శశికళ వాదనను విన్న గవర్నర్... ‘పరిశీలించి చెబుతాను' అని పంపించారు.
నిరాశతోనే శశికళ
కాగా, రాజ్భవన్ నుంచి తిరిగి వస్తున్న శశికళ ముఖంలో తీవ్ర నిరాశ కనిపించింది. తన వాహనంలో వెళ్తూ ఆమె బలవంతంగా నవ్వేందుకు యత్నించారు. అనంతరం పోయెస్ గార్డెనకు వెళ్లిన శశికళ.. తన చేతిలో ఉన్న ఫైళ్లను విసిరేసి కన్నీటిపర్యంతమైనట్లు తెలిసింది. చిన్నమ్మ హఠాత్తుగా ఎందుకు ఏడుస్తున్నారో అర్థంగాక కుటుంబసభ్యులు బిత్తరపోగా... పక్కనున్న నేతలు ఆమెను ఓదార్చినట్లు సమాచారం. శశికళకు గవర్నర్ 20 నిమిషాలు కేటాయించినట్లు తెలిసింది.
రాష్ట్రపతి, కేంద్రానికి నివేదికలు..
పన్నీర్ సెల్వం, శశికళ వాదనలు విన్న గవర్నర్... ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. రాష్ట్రపతికి, ప్రధానమంత్రి కార్యాలయానికి, కేంద్ర హోం మంత్రికి విడివిడిగా నివేదికలను పంపించారు. అయితే... మరింత సమగ్రంగా నివేదిక పంపాలని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గవర్నర్కు సూచన అందినట్లు తెలిసింది. విద్యాసాగర్ రావు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో ఫోన్లో కూడా మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం.