షాక్: శశికళ ముందు పన్నీర్ ఎత్తులు చిత్తు, పన్నీర్ వైఫల్యాలిలా....
అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ వ్యూహాల ముందు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యూహాలు బెడిసి కొట్టాయి. అందరి మద్దతు ఉండి కూడ పన్నీర్ కు సక్సెస్ కాలేకపోయారు.
చెన్నై:అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ వ్యూహల ముందు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యూహలు బెడిసి కొట్టాయి. సినీ పరిశ్రమ, కేంద్రం నుండి పూర్తి మద్దతు ఉందనే ప్రచారం ఉన్నా పన్నీర్ కు కలిసి రాలేదు. శశికళ వర్గం నుండి ఎంఏల్ఏలను తన వైపుకు తిప్పుకోవడంలో వైఫల్యం చెందారు.
తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్ సెల్వం శశికళకు ఎదురుతిరిగిన తర్వాత శశికళ వైపు ఉన్న ఎంఏల్ఏలను తన వైపుకు తిప్పుకోవడంలో విజయం సాధించలేకపోయారు. రిసార్ట్స్ లోనే ఎంఏల్ఏలు ఉండడంతో పన్నీర్ ప్రయత్నాలు ఫలించలేదు.
కేసు శశికళ ముఖ్యమంత్రి పదవికి అడ్డంకిగా మారింది. ఈ ప్రయత్నంలో శశికళ తన వ్యూహాలకు పదును పెట్టింది. తన స్థానంలో పళని స్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించింది.
పళనిస్వామి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకొన్నారు. అసెంబ్లీలో పళనిస్వామి ముఖ్యమంత్రిగా బలనిరూపణ చేసుకొనే వరకు శశికళ వర్గం వ్యూహాత్మకంగానే వ్యవహరించి విజయం సాధించింది.
అన్నీ ఉండి పన్నీర్ ఫెయిల్
అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళకు ఎదురుతిరిగిన తర్వాత పన్నీర్ సెల్వం పై సానుభూతి పెరిగింది. తమిళ సినీ పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో పన్నీర్ కు మద్దతు పెద్ద ఎత్తున లభించింది. శశికళ వర్గం నుండి ఎంఏల్ఏలు, ఎంపిలు పన్నీర్ వైపుకు వచ్చారు.బిజెపి కూడ పరోక్షంగా పన్నీర్ కు సహకరించినట్టుగానే ఉన్నట్టు ప్రచారం సాగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో శశికళ వర్గం నుండి మరికొందరు ఎంఏల్ఏలను తన వైపుకు తిప్పుకోవడంలో పన్నీర్ సఫలీకృతం కాలేదు.
శశికళ ముందు జాగ్రత్త చర్యలు
జయలలిత సమాధి వద్దే పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటు బావుట ఎగురవేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంఏల్ఏలు తన పట్టు జారిపోకుండా శశికళ ముందు జాగ్రత్త చర్యలను తీసుకొన్నారు. రిసార్ట్ కు ఎంఏల్ఏలను తరలించి వారంతా తన పట్టునుండి తప్పిపోకుండా శశికళ జాగ్రత్తలు తీసుకొన్నారు. భవిష్యత్తు గురించి శశికళ ఎంఏల్ఏలకు హితబోధ చేశారు.
చిన్నమ్మ ఆశీస్సులతో టిక్కెట్లు పొందినవారే అత్యధికులు
గత ఎన్నికల్లో ఎక్కువమంది ఎంఏల్ఏలు చిన్నమ్మ ఆశీస్సులతో టిక్కెట్లు పొందారు. ఇది కూడ శశికళకు కలిసి వచ్చింది. ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని శశకళ వర్గం నుండి పన్నీర్ వైపుకు ఎంఏల్ఏలు వచ్చేందుకు వెనుకాడారు.అంతే కాదు ఎక్కువ మంది ఎంఏల్ ఏలు కూడ తొలిసారి ఎంఏల్ఏగా విజయం సాధించినవారే.దీంతో వీరంతా శశికళకు ఎదురుతిరిగి పన్నీర్ సెల్వం వైపుకు వచ్చేందుకు ధైర్యం చేయలేకపోయారు.
ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్దంగా లేకపోవడం కూడ కారణం
చిన్నమ్మ ఆశీస్సులున్న ఎంఏల్ఏలే. అంతేకాదు అసెంబ్లీ రద్దుచేసి ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్ళే బదులు శశికళ వర్గం వైపు కొనసాగితే మరో నాలుగేళ్ళ పాటు ఎంఏల్ ఏ లుగా కొనసాగే అవకాశం ఉంటుందని కొత్త ఎంఏల్ఏలు భావించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి ఎన్నికలకు వెళ్తే అసాధారణ రాజకీయ పరిస్థితులున్న నేపథ్యంలో అన్నాడిఎంకె కలిసివస్తోందో లేదా అనే భయం కూడ వారికి ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పన్నీర్ వైపుకు రాకుండా చిన్నమ్మ వైపే కొత్త ఎంఏల్ఏలు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పట్టు లేకపోవడం కూడ పన్నీర్ కు నష్టమే
అన్నాడిఎంకె పార్టీపై పన్నీర్ సెల్వానికి పట్టు లేదు. జయలలిత బతికున్నంత కాలం ఆమె పార్టీని నడిపించేది. జయలలిత మరణించిన తర్వాత పార్టీని శశికళ నడిపిస్తున్నారు. పార్టీని ఆమె తన గుప్పిట్లోకి తీసుకొన్నారు. పార్టీ సీనియర్లంతా కూడ ఆమె వెన్నంటే ఉన్నారు. పన్నీర్ కు పార్టీపై పట్టు లేకపోవడం కూడ ప్రధానంగా నష్టం కల్గించింది. అంతే కాదు ఎంఏల్ఏలపై కూడ ఆయనకు పట్టు లేకుండా పోయింది. తన మాట వినే ఎంఏల్ఏలు గణనీయంగా లేకపోవడం కూడ ఆయనకు తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెట్టింది.
ఎంఏల్ఏలకు వల వేయడంలో వైఫల్యం?
రెండు వారాల వ్యవధి ఉంది. ఈ సమయంలో పన్నీర్ సెల్వం శశికళకు మద్దతుగా నిలిచిన ఎంఏల్ఏలను తన వైపుకు తిప్పుకోవడంలో వైఫల్యం చెందారు. శశికళ తరహలో ఎంఏల్ఏలను ఆయన తన వైపునే ఉండేలా వ్యూహలను రచించలేకపోయారు. శశికళ వర్గంలోని ఎంఏల్ఏలంతా తనకే మద్దతిస్తారని అతి విశ్వాసం కూడ పన్నీర్ సెల్వం కొంప ముంచిందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మెతక వైఖరి కొంపముంచిందా?
పన్నీర్ సెల్వం మెతక వైఖరిని అవలంభిస్తారు. జయలలిత బతికున్నంత కాలం ఆమె పట్ల విధేయతతో ఉన్నారు. అయితే స్వతహగా పన్నీర్ మెతక వైఖరితో ఉంటారు. శశికళ వర్గంలోని ఎంఏల్ఏలు తన వైపుకు తిప్పుకోవడంలో ప్రత్యేకంగా వ్యూహలను రచించలేదు. పన్నీర్ కు పగ్గాలు దక్కకుండా శశికళ చేయని ప్రయత్నమంటూ లేదు. కాని, పన్నీర్ మాత్రం ప్రత్యామ్నాయాలను చూసుకోలేదు.శశికళ ముఖ్యమంత్రి కాకపోతే మరో అభ్యర్థిని రంగంలోకి తెస్తే ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై కేంద్రీకరించినట్టుగా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.