పేపర్ దిద్దుకొని 100మార్కులేసుకున్న ఇంటర్ విద్యార్థి
అహ్మదాబాద్: గుజరాత్లో పన్నెండో తరగతి చదువుతున్న హర్షద్ అనే విద్యార్థి తానే పరీక్ష రాసి, తానే పేపర్ దిద్దుకొని వందకు వంద మార్కులు వేసుకున్నాడు. పేపర్ దిద్దేవాళ్లలాగే ఎర్రపెన్నుతో దిద్ది మార్కులు వేసుకొని, పరీక్ష పూర్తయ్యాక సూపర్ వైజర్కు అందించాడు.
ఇంటర్ చదువుతున్న హర్ధద్ మొద్దబ్బాయి. దీంతో, తానే పేపర్ దిద్దుకొని, తానే మార్కులు వేసుకున్నాడు. అతను ఎకనామిక్స్ పేపరును తానే దిద్దుకొని, మార్కులు వేసుకున్నాడు.
పరీక్షను రాసిన విద్యార్థికి వాస్తవంగా 34 మార్కులు మాత్రమే వచ్చాయని, సూపర్ వైజరుకు పేపర్ ఇచ్చే ముందు ఈ ఘటన జరిగిందని, దీనిపై కేసు పెట్టామని రాష్ట్ర సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.
విద్యార్థి నిర్వాకాన్ని గుర్తించని అధ్యాపకుల పైనా కేసు పెట్టినట్టు తెలిపారు. పేపర్ దిద్దే టీచర్లకు అనుమానం రాకుండా ఉండేందుకు మెయిన్ పేజీలో టోటల్ మార్కులను వేయకుండా హర్షద్ జాగ్రత్త పడ్డాడని, పేపర్ దిద్దిన టీచర్, ముందూ వెనుకా చూడకుండా మార్కుల టోటల్ కూడి 100/100 వేసేశాడని చెప్పారు.
హర్షద్కు గుజరాతీలో 13, ఇంగ్లీషులో 12, సంస్కృతంలో 4, సోషియాలజీలో 20, సైకాలజీలో 5, జియోగ్రఫీలో 35 మార్కులు మాత్రమే వచ్చాయని, దీంతో అనుమానం వచ్చి పరిశీలించగా విషయం వెలుగుచూసిందన్నారు. బాధ్యులందరి పైనా చర్యలు తీసుకుంటామన్నారు.