పిక్నిక్కు డబ్బులివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
ముంబై: విహారయాత్ర(పిక్నిక్)కి తల్లిదండ్రులు డబ్బులివ్వలేదని 14ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముంబైలోని డొంబివిలి ప్రాంతంలో నివసిస్తున్న మౌనిక(14) స్థానిక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. పాఠశాల యాజమాన్యం జనవరిలో పిక్నిక్కి సన్నాహాలు చేసింది. ఇందుకోసం రూ.750 కట్టాల్సి ఉంది.
కాగా, వెంటనే ఇంటికి వచ్చి తన స్నేహితులతో పిక్నిక్కి వెళ్తానని తల్లిదండ్రులని అడిగింది. ఆర్ధిక పరిస్థితి బాగోలేదని వారు డబ్బు ఇవ్వలేమని తేల్చి చెప్పారు.
ఎంతచెప్పినా వినిపించుకోకుండా వారితో అమర్యాదకరంగా ప్రవర్తించడంతో తల్లి మౌనికపై చేయిచేసుకుంది. దీంతో మౌనిక ఆదివారం ఇంట్లో నుంచి వెళ్లిపోయి పక్కనే ఉన్న భవనం నుంచి దూకేసింది.
తీవ్రంగా గాయపడిన బాలికని చుట్టుపక్కల వారు గమనించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. బాలిక మృతితో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముుకున్నాయి.