రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం..! జార్ఖండ్ నుంచి గెలిచిన వైసీపీ మాజీ ఎంపీ..!
రాజ్యసభకు జరుగుతున్న ద్వైవార్షిక ఎన్నికల్లో ఇవాళ మరో సంచలనం నమోదైంది. ఒకప్పుడు వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఓ రాజ్యసభ ఎంపీ.. తన పదవీకాలం పూర్తి కావడంతో మరో రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికల్లో రంగంలోకి దిగారు. అయితే ఏ పార్టీ తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగారు. కానీ అనూహ్యంగా ఆయన రాజ్యసభకు ఎన్నికై సంచలనం సృష్టించారు. దీనికి కారణం రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగే.
జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఖాళీ అయిన రెండు స్ధానాలకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. ఇందులో 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఎన్డీఏకు తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ, ఆ కూటమి మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వానీ (Parimal Nathwani) రాజ్యసభ స్థానాన్ని గెలుచుకున్నారు. ఇండియా కూటమి మిత్రపక్షాలు క్రాస్ ఓటింగ్ చేశాయని అనుమానిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ను గతంలో వైసీపీ రాజ్యసభకు పంపింది.

జార్ఖండ్ లో రెండు రాజ్యసభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో అధికార జేఎంఎం కూటమి తరఫున జేఎంఎం, కాంగ్రెస్ అభ్యర్ధులు పోటీ చేశారు. జేఎంఎం తరఫున వైద్యనాథ్ రామ్ ఓ స్ధానం గెల్చుకున్నారు. మరో సీటుకు పోటీ చేసిన ప్రణవ్ ఝా ఓటమి పాలయ్యారు. ఎన్నికలో గెలవడానికి ఒక అభ్యర్థికి కనీసం 28 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం కాగా...నత్వానీ 32 ఓట్లు సాధించారు. వాటిలో రెండు చెల్లనివిగా ప్రకటించారు. అసెంబ్లీలో ఎన్డీఏకు కేవలం 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో , కూటమి బయట ఉన్న కనీసం నలుగురు ఎమ్మెల్యేలు ఆయనకు అనుకూలంగా క్రాస్-వోటింగ్ చేశారని అర్ధమవుతోంది. స్వరాష్ట్రమైన జార్ఖండ్ నుంచి మరోసారి ఎంపీగా గెలవడం సంతోషంగా ఉందని పరిమళ్ నత్వానీ ట్వీట్ చేశారు.














Click it and Unblock the Notifications