వైఎస్ చేతులెత్తేశారు: కంచి ఘటనపై పరిపూర్ణానంద ఫైర్
ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద స్వామి విలేకరులతో మాట్లాడారు. కంచి స్వాములను అరెస్టు చేసినప్పుడు వైయస్ను కలిస్తే తన చేతుల్లో ఏమీ లేదన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైయస్ సిఎంగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కంచి స్వామి అరెస్టు జరిగిందని గుర్తు చేశారు.
కంచి స్వామి అరెస్టు అరిష్టాలకు దారి తీస్తుందని తాము ఆనాడే హెచ్చరించామన్నారు. కంచి స్వామి కేసులో తమిళనాడు పోలీసుల తీరును కోర్టు కూడా తప్పు పట్టిందన్నారు. తమిళనాడు పోలీసులు హిందూమతాన్ని కించపర్చేలా నిస్సిగ్గుగా వ్యవహరించారని నిప్పులు చెరిగారు. హిందూ ధర్మాన్ని దెబ్బతీసేందుకు దండం పట్టుకున్న యతీశ్వరులను అరెస్టు చేస్తున్నారని విమర్శించారు.
ఇస్లామిక్ విశ్వవిద్యాలాయన్ని తిరుపతిలోనే ఎందుకు పెట్టాలన్నారు. ఇస్లామిక్ విశ్వవిద్యాలయం పెట్టేందుకు ఎన్నో ప్రాంతాలు ఉండగా కావాలని తిరుపతిలో పెట్టడమేమిటన్నారు. ఓ మతక్షేత్రం వద్ద అన్యమత చిత్రాలు ఉండటం వివాదాలకు ఆజ్యం పోయడమే అన్నారు. తిరుపతిని లక్ష్యంగా పెట్టుకున్న ఉగ్రవాదులు పుత్తూరులో పట్టుబడ్డారన్నారు. ప్రభుత్వాలు హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకొని పని చేస్తున్నాయని ఆరోపించారు.