పార్లమెంటు సెషన్స్కు తెర: 13బిల్లులకు ఆమోదం
న్యూఢిల్లీ: దాదాపు నెల రోజుల పాటు నిరసనలతో గందరగోళం మధ్య కొనసాగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సభ్యుల గొడవ, గందరగోళం మూలంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు దాదాపుగా వృథా అయ్యాయని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ చెప్పకనే చెప్పారు.
సభ్యులు హుందాగా వ్యవహరించటంతో పాటు సభను సజావుగా నడిపించటం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి కానీ ఇలా సభా కార్యక్రమాలను స్తంభింపజేయకూడదని సుమిత్రా మహాజన్, హమీద్ అన్సారీ హితవు చెప్పారు.
కాగా, కీలకమైన ‘వస్తు సేవల పన్ను' (జీఎస్టీ) బిల్లు ఆమోదం పొందకుండానే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. నవంబరు 26న శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. వివిధ అంశాలపై కాంగ్రెస్పార్టీ చేపట్టిన నిరవధిక నిరసనతో రాజ్యసభ 47 పనిగంటలను నష్టపోయింది.
లోక్సభ కొంత మెరుగైన పనితీరును చూపింది. 13 బిల్లులు ఆమోదం పొందగా, ధరల పెరుగుదల, వరదలు, కరవు వంటి సమస్యలపై లోక్సభలో చర్చలు జరిగాయి. కాంగ్రెస్ నిరసన మధ్యే రాజ్యసభలో తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయి. అయితే.. దేశంలోని ప్రత్యక్ష పన్ను వ్యవస్థను సమూలంగా మార్చటానికి ఉద్దేశించిన జీఎస్టీ బిల్లు మాత్రం రాజ్యసభ ఆమోదం పొందలేకపోయింది.
ఈ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించటంతో ఈ పరిస్థితి తలెత్తింది. జీఎస్టీ వంటి అంశాలపై ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య సయోధ్య కుదరనప్పటికీ.. ‘బాలల న్యాయ బిల్లు'పైన మాత్రం వామపక్షాలు తప్ప అన్నిపార్టీలూ ఏకాభిప్రాయంతో ముందుకొచ్చి ఆమోదముద్ర వేయటం గమనార్హం. అత్యాచారం వంటి నీచమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో బాలలుగా పరిగణించే వయసును 18 నుంచి 16కు తగ్గించటం కోసం ఈ బిల్లును రూపొందించారు.
లోక్సభలో భారత ప్రమాణాల బిల్లు, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (వేతనాలు, పని పరిస్థితుల) బిల్లు, జాతీయ జలమార్గాల బిల్లు, బోనస్ బిల్లు, కేటాయింపుల బిల్లు, వాణిజ్యకోర్టుల బిల్లుతోపాటు మొత్తం 13 బిల్లులు ఆమోదం పొందాయి.
రాజ్యసభలో తొమ్మిది బిల్లులపై ఆమోదముద్ర పడింది. వీటిలో కేటాయింపుల బిల్లు, ఎస్సీఎస్టీలపై అత్యాచారాల నిరోధక బిల్లు, బాలల న్యాయబిల్లు ముఖ్యమైనవి. సమావేశాల చివరిరోజైన బుధవారం రాజ్యసభలో నాలుగుబిల్లులు ఆమోదం పొందాయి. వాటిలో.. వాణిజ్యకోర్టుల బిల్లు, మధ్యవర్తిత్వం రాజీ బిల్లు, అణుశక్తి బిల్లు, బోనస్చెల్లింపు బిల్లు ఉన్నాయి.